Restoration of buses on VST route from Indira Park:

హైదరాబాద్ లోని ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సు సర్వీసులపై అప్ డేట్ ఇచ్చింది. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ మార్గంలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం కావడంతో ఆ రూట్లో వెళ్లే బస్సులను TSRTC పునరుద్ధరించింది. గతంలో లాగానే 113 నెంబర్ బస్సులు ఆ రూట్ లో యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కొత్తగా బస్సు సర్వీసు..సికింద్రాబాద్- మణికొండ మార్గంలో కొత్తగా బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. 5 K/M నెంబర్ గల ఈ బస్సులు మెహిదీపట్నం మీదుగా మణికొండకు వెళ్తాయి. ఈ సదుపాయాలను వినియోగించుకుని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 

రాఖీ పౌర్ణమి సందర్భంగా లక్కీ డ్రా, బహుమతులు ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించి.. వారి ప‌ట్ల సంస్థకున్న గౌర‌వభావాన్ని ప్ర‌క‌టించనున్నారు. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. లక్కీ డ్రాలో వీరికి ఛాన్స్..టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ నెల 30, 31 తేదిల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాయాలి. వివరాలు రాసిన ఆ టికెట్ ను బస్టాండ్లలో ఏర్పాటు చేసిన  డ్రాప్ బాక్స్ లలో వేయాలని మహిళా ప్రయాణికులకు సూచించారు. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేయనున్నామని సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు.