TSRTC News: హైదరాబాద్ లో ఆఫీసులకు వెళ్లాలంటే కనీసం రెండు బస్సులు అయినా మారాల్సి ఉంటుంది. చాలా మంది ప్రతిరోజూ ఇలా బస్సులు మారుతూ ఆఫీసులకు వెళ్లడం, బస్సులు మారుతూ తిరిగి ఇంటికి చేరుకోవడం పరిపారిటిగా మారింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే కొన్ని రూట్లను పొడగించి ఈ తరహా బస్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మరికొన్ని రూట్లపై కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, హౌస్ కీపింగ్ సిబ్బంది, ఔటర్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూట్ల పొడగింపును చేపట్టినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. 


ఉప్పల్ నుంచి మెహదీపట్నానికి నేరుగా బస్సులు


హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఐటీ సంస్థల్లో పని చేసేందుకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వైపు ప్రయాణం చేస్తారు. కానీ వీళ్లంతా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వద్ద బస్సులు మారాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతున్నారు. అలాగే బస్సులకు బదులుగా ఆటోలు, క్యాబ్లలో కూడా వెళ్తున్నారు. ఇదే విషయాన్ని ఆర్టీసీ గుర్తించి జగద్గిరిగుట్ట నుంచి నేరుగా ఐటీ కారిడార్ లకు చేరుకునేలా బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు.


అంతేకాకుండా ఈసీఐఎల్ నుంచి మేడ్చల్, షామీర్ పేట్ లకు వెళ్లేందుకు గతంలో రెండు బస్సులు మారాల్సి ఉంది. దీంతో ఐసీఐఎల్ నుంచి రెండు వైపులా నేరుగా వెళ్లేందుకు బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెహదీపట్నం చౌరస్తాలో మలుపు తిప్పుకోవడం ఎంతో కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉప్పల్-మెహదీపట్నం(113ఎం) బస్సులను కొన్నింటిని మంచి రేవుల వరకు పొడగించారు. ఈ బస్సులు బోడప్పల్ కాలనీ నుంచి మంచిరేవుల వరకు నేరుగా రాకపోకలు సాగిస్తాయి. బోడుప్పల్ నుంచి డైరెక్ట్ నానక్ నగర్, షేక్ పేట, పుప్పాలగూడ, మంచిరేవుల వరకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకోవచ్చు. 


మేడ్చల్ నుంచి బేగంపేట మీదుగా మెహదీపట్నానికి బస్సు


లింగంపల్లి నుంచి నల్లగండ్ల మీదుగా క్యూసిటీ వరకు మరో కొత్త రూట్ ను కూడా ఎంపిక చేశారు. మేడ్చల్ వైపు నుంచి ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు మెహదీపట్నం వరకు ప్రయాణం చేస్తున్నారు. కానీ సికింద్రాబాద్ లో దిగి మెహదీపట్నం బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కువ రద్దీగా ఉండే ఈ చోట బస్సు ఎక్కడానికి ప్రయాణికులు చాలానే కష్టపడాల్సి వవస్తుంది. ఈ సమస్యలను తొలగించేందుకు మేడ్చల్ నుంచి బేగంపేట మీదుగా మెహదీపట్నానికి డైరెక్ట్ బస్సును వేశారు. అలాగే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు ఇటు ఘట్కేసర్ నుంచి మేడ్చల్ వరకు ఔటర్ కు ఆనుకొని ఉన్న కాలనీలను, గ్రామీణ ప్రాంతాలను కనెక్ట్ చేసే విధంగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


సర్వీస్ రోడ్డు మార్గాల్లో సిటీ బస్సులను అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులకు నిరాటంకమైన రవాణా సదుపాయం లభించనుంది. ఉబర్, ఓలా లాంటి సదుపాయలను ఉపయోగించుకొని కూడా చాలా మంది గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆర్టీసీ అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.