TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన నిందితులను ఈరోజు ఈడీ అధికారులు చంచల్ గూడ జైల్లోనే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ను విచారణ చేసేందుకు సోమవారం ఉదయం ఈడీ అధికారులు జైలుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ప్రధాన నిందితులను విచారణ చేస్తున్నారు. నలుగురు సభ్యులు ఈడీ అధికారుల బృందం చంచల్ గూడ జైలుకు వెళ్లింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది.


నిందితుల తరఫు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకీ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్ ను కోర్టు అనుమతించింది. ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలని జైలు సూపరింటెండెంట్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈరోజు, రేపు చంచల్ గూడ జైల్లోనే ఈ కేసులో ప్రధాన నిందితులు వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.


ఇప్పటికే చాలా కొత్త విషయాలు వెలుగులోకి..


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే చాలా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డికి కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా తెలిసింది? అనేది చిక్కుముడిగా మారింది. మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంతవరకు 18 మంది నిందితులను గుర్తించి.. 17 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించిన రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు సిట్ పోలీసులు గుర్తించారు. అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీచేశారు. దీనిపై స్పందించిన అతను గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం తనకు అందలేదంటూ సిట్ అధికారులకు వాట్సప్ ద్వారా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ డైరీలో రాసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లు నిందితులు పోలీసుల దర్యాప్తు, సిట్ కస్టడీలోనూ ఒకేవిధంగా సమాధానమిచ్చారు.


అయితే శంకరలక్ష్మి  డైరీని స్వాధీనం చేసుకొని పరిశీలించిన సిట్ అధికారులు దానిలో ఎక్కడా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ రాసినట్లు ఆధారాల్లేవని నిర్ధారణకు వచ్చారు. సిట్ పోలీసులు, ఈడీ అధికారుల విచారణలోనూ శంకరలక్ష్మి ఇదే విషయాన్ని చెప్పారని సమాచారం. ముగ్గులు ఒకే విధమైన సమాధానం ఇవ్వడం, డైరీలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో పెద్ద తలకాయల ప్రమేయం ఉండే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో మరికొందరు ఉన్నట్లు గుర్తించి అనుమానితుల జాబితాను సిట్ రూపొందించినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు గ్రూప్-1, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) పరీక్ష రాసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరికీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధాలున్నాయా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.