TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సెక్రెటరీ, ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా.. ఆమె విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు అనితా రామచంద్రన్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ప్రవీణ్ కు సంబంధించి అంశాలపై ఆమెను అధికారులు ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పరిపాలన, కాన్ఫిడెన్షియల్ విభాగంపై పలు ప్రశ్నలు సంధించారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్.. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. దీంతో ప్రవీణ్ గురించి ప్రధానంగా అనితా రామచంద్రన్ ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.  టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన వివరాలను సైతం సిట్ అడిగినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తో పాటు సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.


మరింత వేగవంతమైన దర్యాప్తు


గ్రూప్ -1 పరీక్షలో ప్రధాన నిందితుడైనా ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయి. కానీ ఎక్కడ దొరికిపోతానో అని వ్యక్తిగత వివరాల విభాగంలో డబుల్ బబ్లింగ్ చేసి డిస్ క్వాలిఫై అయ్యేలా చేసుకున్నాడు. గ్రూప్-1 పరీక్షలో 100కు పైగా మార్కులు వచ్చిన వారిని పిలిపించిన అధికారులు వారి వాంగ్మూలాన్ని ఇప్పటికే రికార్డు చేశారు. మరికొంత మందిని రెండు మూడు రోజుల్లో పిలిచి ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. లీకైన గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్ పలువురికి అందించగా అందులో 15 మందిని గుర్తించి అరెస్టు చేశారు. ఇంకెంత మందికి ఆ లీకైన ప్రశ్నాపత్రాలు చేరాయోనని అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. వారి ద్వారా ఎవరెవరికి నగదు అందింది అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.  


రంగంలోకి ఈడీ!


ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో లక్షల కొద్దీ రూపాయలు చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో త్వరలోనే ఈడీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కొందరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను సైతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనుంది. దీంతోపాటు సైబరాబాద్ పోలీసులు బయటపెట్టిన డేటా లీకేజీపైనా మరో కేసు ఈడీ నమోదు చేసింది. ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ రంగంలోకి దిగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోనుడడం గమనార్హం.