తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ సర్వీస్‌ (టీఎస్పీఎస్సీ) పరీక్షా పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్‌ తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులకు పాల్పడ్డ విషయం బయటికి వచ్చింది. వీరిద్దరూ గ్రూప్ - 1 పేపర్ లీక్ చేసిన విషయాన్ని టీఎస్పీఎస్సీలోనే పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్‌లు గుర్తించారు. అయితే, ఉన్నతాధికారులకు చెప్తారేమో అనే భయంతో షమీమ్, రమేష్‌లను ప్రవీణ్, రాజశేఖర్‌లు ప్రలోభ పెట్టారు. గ్రూప్ 1 పేపర్ మీకు కూడా ఇస్తామని, మీరు కూడా గ్రూప్ 1 పరీక్ష రాసి మంచి ఉద్యోగం సాధించవచ్చని ఆశ పెట్టారు. ఆ ప్రకారమే షమీమ్, రమేష్‌లకు కూడా గ్రూప్‌ - 1 పేపర్‌ను పంపించారు.


పేపర్ల లీకేజీకి సంబంధించి మరో ముగ్గురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. వీరిలోనే షమీమ్, రమేష్ మరో వ్యక్తి సురేష్ కూడా ఉన్నారు. వీరిలో సురేష్ తప్ప మిగతా ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే. ఈ షమీమ్, రమేష్ నుంచి న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కు పేపర్ లీక్ చేసినట్లు తెలిసింది. వీళ్ళు ఇంకా ఎంతమందికి లీక్ చేశారనే కోణంలో ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గ్రూప్ - 1 పరీక్ష రాసి, క్వాలిఫై కాని టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు కూడా పేపర్ లీక్ విషయం తెలుసా అనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.