TSRTC : అత్యాధునిక హంగులతో 10 కోట్ల వ్యయంతో నిర్మించిన టీఎస్ ఆర్టీసీ నర్సింగ్ కాలేజీ నూతన భవనాన్ని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. హైదరాబాదులోని తార్నాక ఆసుపత్రి ప్రాంగణంలో ఈ నర్సింగ్ కాలేజీ భవనాన్ని నిర్మించారు.


తరగతి గదులు, లాబొరేటరీలను పరిశీలించి... నూతన భవనంలో విద్యార్థులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తార్నాక టీఎస్ఆర్టీసీ ఆస్పత్రికి అనుసంధానంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి భవిష్యత్ ఉందని,  విద్యార్థులందరూ టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న నర్సింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


త‌న‌తో పాటు ఎండీ పట్టుదల, వ్యూహాత్మక నిర్ణయాలతో సంస్థ పురోభివృద్ధి సాధ్యం అవుతోందని, తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయం నాటికి ఇప్పటికి సంస్థలో గణనీయంగా నష్టాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆస్పత్రులల్లో నర్సులు కుటుంబ సభ్యులుగా రోగులను చూసుకుంటూ.. అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని గుర్తుచేసుకున్నారు. చికిత్స సమయంలో రోగులకు తల్లికంటే ఎక్కువగా సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్న నర్సుల సేవలు ఎనలేనివని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ సజ్జనర్‌ మాట్లాడుతూ.... “నర్సింగ్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉన్నది. కోర్సు పూర్తి చేసిన నర్సింగ్‌ విద్యార్థులకు విదేశాలలోనూ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. అందుకే కష్టపడి చదివి విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని పేర్కొన్నారు. గత కొన్నేళ్ల క్రితం నర్సింగ్‌ కళాశాలను పెట్టాలని అనుకున్నామని ఇంత తక్కువ వ్యవధిలోనే అంటే ఒక సంవత్సరం లోనే నర్సింగ్‌ కళాశాల భవనం మెరుగైన సదుపాయాలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇది గోల్డెన్‌ ఛాన్స్‌ అని నర్సింగ్‌ విద్యార్థులు బాగా చదువుకుని అటు కుటుంబ సభ్యులకు, ఇటు సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. 


నర్సింగ్‌ కళాశాల భవనాన్ని రూ.10కోట్లతో నిర్మించామని చెప్పారు. 50 మంది విద్యార్థులతో 2021-22 విద్యా సంవ‌త్స‌రంలో ప్రారంభమైన ఈ కళాశాలలో  మేనేజ్‌మెంట్ కోటా 20 సీట్లలో ఆర్‌టిసి ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా ఐదు సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నర్సింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు త్రిష, అమూల్యను ఘనంగా సన్మానించారు. త్రిషకు రూ.10 వేలు, అమూల్యకు రూ.7 వేల నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. 


ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవీందర్, తార్నాక ఆసుపత్రి సలహాదారు, ఓఎస్డీ సైదిరెడ్డి,  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఎ, ఎం, పి అండ్‌ ఎం) కృష్ణకాంత్, జాయింట్ డైరెక్టర్ (విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ) సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, సీఈఈ రాంప్రసాద్, సీఎఫ్ఎం విజయపుష్ఫ, తార్నాక టీఎస్ఆర్టీసీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శైలజా కృష్ణమూర్తి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర తులసి, తదితరులు పాల్గొన్నారు.