హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జోరుగా జరుగుతున్న వేళ టీఆర్ఎస్ నేతలు దీనిపై విమర్శలు చేశారు. ఇవి జాతీయ కార్యవర్గ సమావేశాలా? లేక రాష్ట్ర సమావేశాలా అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నెత్తి మీద వంద రూపాయలు పెడితే కూడా ఎవడూ పట్టించుకోడని ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బండి సంజయ్ బీజేపీలో లేకపోతే ఆయన్ని ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. పీయూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ తీరుపై విమర్శలు చేశారు.


అనురాగ్ ఠాకూర్ వి వారసత్వ రాజకీయాలే
‘‘అవి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలా.. తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలా? కేసీఆర్ ను దూషించేందుకే సమావేశాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ నేతలు ఓర్చు కోలేకపోతున్నారు. మంత్రులు అనురాగ్ ఠాగూర్, స్మృతి ఇరానీ, బండి సంజయ్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేసీఆర్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధి కాదు.. ప్రజల మనసులు గెలిచి కష్టపడి పైకి వచ్చిన వారు. కేటీఆర్ కూడా ఉద్యమంలో కష్ట పడి ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తండ్రి హిమాచల్ మాజీ సీఎం కాదా? ఠాగూర్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధి కాదా? అనురాగ్ ఠాగూర్ తెలంగాణ లో తిరిగి వాస్తవాలు తెలుసుకోవాలి’’


నెత్తిన వంద పెడితే ఎవరూ పట్టించుకోరు
‘‘తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకు పోతోంది. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో తెలంగాణ పథకాలు అమలవుతున్నాయా? గుజరాత్ లో పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించారు. తెలంగాణ లో 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంటు సరఫరా అవుతోంది. కేంద్ర మంత్రులు తెలుసుకోవాలి. తెలంగాణపై కక్ష గట్టేందుకే బీజేపీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ పై బండి సంజయ్ ఏక వచనంతో మాట్లాడుతున్నారు. బండి సంజయ్ నెత్తి మీద వంద రూపాయలు పెడితే కూడా ఎవడూ పట్టించుకోడు. బండి సంజయ్ కి ఎవరో అవగాహన లేని వారు స్క్రిప్ట్ రాసిస్తున్నట్టున్నారు.


‘‘ బీజేపీలో లేకపోతే బండి సంజయ్ ను ఎవడు పట్టించుకుంటాడు. బీజేపీ ఓటింగ్ శాతం ఎక్కడ పెరిగింది. ప్రధాని ప్రాతినిథ్యం వహించే వారణాసిలో ఎమ్మెల్సీ సీటు కూడా బీజేపీ ఓడిపోయింది. ఒకటి రెండు విజయాలు సాధించిన మాత్రాన ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణ ఓ రాష్ట్రం.. శ్రీలంక ఓ దేశం.. శ్రీలంకతో తెలంగాణ ను పోల్చడానికి బండి సంజయ్ కు సిగ్గుండాలి. పరేడ్ గ్రౌండ్స్ కి  పది లక్షల మందిని తరలిస్తున్నామని గప్పాలు కొడుతున్నారు. 2 లక్షలకు మించి అక్కడ పట్టరు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు పీఎం మోదీ సమాధానం చెప్పాలి. బండి సంజయ్ తన పరిజ్ఞానం పెంచుకోవాలి’’


సేల్స్‌మెన్ అనడంలో తప్పేంటి
‘‘శ్రీలంక ప్రభుత్వాన్ని కాంట్రాక్టు కోసం పీఎం మోదీ ఒత్తిడి చేశారు కనుకే కేసీఆర్ ఆయన్ను సేల్స్ మెన్ అన్నారు.. తప్పేమిటి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి బీజేపీ నేతలకు ఆందోళన అనవసరం. ఆర్బీఐ గణాంకాలు తెలంగాణ అప్పులు కంట్రోల్ లోనే ఉన్నాయని చెబుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణ పరిస్థితి చాలా బాగుంది’’ అని పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి విమర్శించారు.


మోదీ వ్యతిరేకంగా మాట్లాడేది కేసీఆరే -  ఎమ్మెల్యే వివేకానంద
‘‘కేసీఆర్ లాంటి బక్కపలచని మనిషిపై దండ యాత్రకు బీజేపీ నేతలు మిడతల దండులా పడ్డారు. లక్ష మంది కూడా పరేడ్ గ్రౌండ్స్ కు సరిపోరు. మాకు గతంలో సభ పెట్టుకునేందుకు పరేడ్ గ్రౌండ్స్ లో అనుమతి రాలేదు. అయినా కేసీఆర్ సభకు 20 లక్షల మంది పట్టే ప్రదేశం కావాలి. బీజేపీ సభను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎనిమిదేళ్లలో మేము చేసింది ఏమిటీ మీరు చేసింది ఏమిటో చెప్పండి. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటే ఇపుడు నార్త్ ఇండియా కంపెనీలా బీజేపీ మారి దేశాన్ని దోచుకుంటోంది. దేశంలో మోదీకి భయపడకుండా మాట్లాడుతున్న ఏకైక నేత కేసీఆర్ మాత్రమే.’’ అని ఎమ్మెల్యే పి. వివేకానంద అన్నారు.