TPCC Working President Jagga Reddy sensational comments | సంగారెడ్డి: గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్లు గెలిచినా, సంగారెడ్డిలో మాత్రం షాకింగ్ ఫలితం వచ్చింది. రెబల్ అండ్ ఫైర్ బ్రాండ్ అయిన జగ్గారెడ్డి ఓటమితో కుంగిపోలేదు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా, ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని చెప్పి భిన్నమైన కామెంట్లు చేశారు. 


జగ్గారెడ్డి రూటే సపరేట్ 
తన కూతురికి పెళ్లి చెయ్యాల్సి ఉందని, మరోవైపు కొడుకు బిజినెస్ పెడుతా డబ్బులు కావాలని అడుగుతున్నాడని చెప్పారు. అయితే తన జీవితం మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం ఈ 20 ఏళ్లలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి ప్రజల కోసం తాను అందుబాటులో ఉంటానన్నారు. రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్ లో జగ్గారెడ్డి తన ఇంటి వద్ద అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా అన్నారు. కార్యకర్తలు ఎవరు గాంధీ భవన్ కి రావొద్దు అని, మీరు వచ్చినా తాను కలవలేను, మాట్లాడలేను అని స్పష్టం చేశారు. 


మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో  తాను రిలాక్స్ అవుతున్నానని, ఆ మాటలు మనస్ఫూర్తిగా చెబుతున్నా అన్నారు. ఎన్నికల్లో ఓడినా ప్రశాంతంగా ఉన్నానని చెప్పడంతో ఆయన అనుచరులు, స్థానిక కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి తీరుతో ఆశ్చర్యపోతున్నారు. అయితే సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా తాను ఎమ్మెల్యేగా ఓడిపోయనని ఫీల్ కావొద్దని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక నియోజకవర్గ అభివృద్ధి కోసం పనులు చేసుకుందాం అన్నారు. సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారీగా ఉండాలని స్థానిక పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు తన విజయంపై ఎంత ధీమా వ్యక్తం చేశారో, ఓటమి అనంతరం సైతం జగ్గారెడ్డి తీరులో ఏ మార్పు లేదు.

Also Read: తల్లిదండ్రులను హెచ్చరిస్తూ నటుడు సాయిధరమ్ తేజ్ ట్వీట్ - స్పందించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి