ఎప్పుడూ పని ఒత్తిడితో, తీరిక లేకుండా ఉండే తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులకు కాస్త ఆటవిడుపు లభించింది. హైదరాబాద్ లో శనివారం (ఫిబ్రవరి 11) జరిగిన ఫార్ములా - ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ కార్ రేసుకు తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులు హాజరయ్యారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒకే వేదిక మీద కలుసుకున్నారు. ఎదురుపడ్డ వీరు ఆలింగనం చేసుకొని, కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి రేస్ లు జరగటం గ్రేట్ అని అన్నారు. ప్రపంచ స్థాయి కలిగిన రేసులు ఇక్కడ జరగడం తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వకారణం అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్ర ప్రాంత ప్రజల పాత్ర ప్రముఖమైనదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు ఉన్నారని, వారి వల్లే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు.


హైదరాబాద్ తెలుగు ప్రజలందరిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని గుడివాడ చెప్పారు. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది..అది పెట్ట కావడానికి టైం పడుతుందని వివరించారు. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించే దిశగా ఏపీని అభివృద్ధి చేస్తామని, విశాఖపట్నాన్ని హైదరాబాద్ మాదిరిగా డెవలప్ చేస్తామని చెప్పారు.


ఏపీలో ఇలాంటి కార్ రేసింగ్ ఈవెంట్లు ఎప్పుడు నిర్వహిస్తారని విలేకరులు ప్రశ్నించగా.. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది.. అది పెట్ట కావడానికి టైం పడుతుందని మరోసారి తనదైన శైలిలో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. తెలుగు వారిగా హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా నిలవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.






టీడీపీ ట్వీట్


ఇదే అదనుగా తెలుగు దేశం పార్టీ మంత్రిపై సెటైర్లు వేసింది. నాలుగేళ్లు కావస్తున్నా తాడేపల్లి కోడి ఇంకా గుడ్డు పెట్టకపోవడం ఏంటని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది. ‘‘ఏపీలో ఫార్ములా ఈ రేసింగ్ గురించి అడిగితే కోడి గుడ్డు పెట్టాలి.. పొదగాలి అంటున్న మంత్రిగారి విచిత్ర వ్యాఖ్యానాల మాట అటుంచితే.... నాలుగేళ్లు కావస్తున్నా మీ తాడేపల్లి కోడి ఇంకా గుడ్డు పెట్టకపోవడం ఏంటి అని జనం నవ్వుకుంటున్నారు. ఆ కోడికి కోడికత్తి డ్రామాలు తప్ప ఇంకేం చేతకాదు అని మాట్లాడుకుంటున్నారు’’ అని టీడీపీ ట్వీట్ చేసింది.


మంత్రి గుడివాడ అమర్ నాథ్ చాలా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. రుషికొండ మీద రుషులు తపస్సు చేసుంటారు.. అందుకే దానికి రుషికొండ అనే వ్యాఖ్యల నుంచి.. దావోస్ లో మైనస్ 10 డిగ్రీల చలి ఉంటుంది.. ఎవరైనా స్నానం చేస్తారా.. అని చెప్పడం వరకూ ఆయన చాలా స్టేట్‌మెంట్లు నవ్వులపాలు అయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో ఫార్ములా - ఈ రేసింగ్ చూసేందుకు వచ్చి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.