Revanth Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీ ఫిరాయింపుల వ్యాఖ్యలపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య  మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. వారి 8 ఏళ్ల పాలనలోని తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆ రెండు పార్టీలు పరస్పర విమర్శలు, దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. 


తనను బీజేపీలోకి రావాలని అడిగారని ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ అంగీకరించారని.. ఆమె మాటలను సుమోటోగా తీసుకుని సిట్ దర్యాప్తు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలన్నారు. ఈ ఘటనలో సీఎం కేసీఆర్ మాటలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విచారణను కేవలం నలుగురు ఎమ్మెల్యేలకే పరిమితం చేస్తే కోర్టు ముందు సిట్ కూడా దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు.


తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే


రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ ఎస్ ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై కూడా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌లు కలుషిత వాతావరణం సృష్టిస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. వాటాల్లో తేడాలతోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొట్లాట జరుగుతోందన్నారు. దీనికోసమే బీజేపీ.. ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసులతో దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. వివాదాల ముసుగులో 8 ఏళ్ల తప్పిదాలను కప్పిపుచ్చుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. 


కేసీఆర్ వైఖరి హాస్యాస్పదం


ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్ వైఖరి హాస్యాస్పదంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల మాటలు విని సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఒకసారి పార్టీ మారిన వాళ్లు మరోసారి మారరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లిందన్నారు. స్టే కోసం ఎందుకు ప్రయత్నించిందని ప్రశ్నించారు. 


ప్రజా సమస్యలను మరచి


కేంద్రంలోని ఈడీ, సీబీఐ.. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏసీబీ, ఎస్జీఎస్టీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ఎవ్వరూ కూడా స్వేచ్చగా నిద్రపోలేని పరిస్థితి నెలకొందని రేవంత్ రెడ్డి. 2004-14 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు వ్యాపారులను, వ్యాపార సంస్థలను, పార్టీలు మారిన నేతలను వేధించలేదన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడం మాని ఒకరిపై ఒకరు విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. 


ప్రజా సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూమ్ మీటింగ్ ద్వారా నాయకులందరితో చర్చించి త్వరలోనే కాంగ్రెస్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ముందుగా రైతు సమస్యలపై పోరాటం చేయాలనుకుంటున్నామని తెలిపారు. డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో బలహీన వర్గాల పక్షాన.. బీసీ జనాభా లెక్కలు, వారికి దక్కాల్సిన నిధులు తదితర సమావేశాలపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు కాబట్టే టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని, ఇటువంటి దాడులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. దాడులు ఎవరూ చేసినా తప్పే అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.