Telugu Student dies in US | హైదరాబాద్: అమెరికాలో పేలిన తూటాకు మరో తెలుగు యువకుడు బలైపోయాడు. శనివారం తెల్లవారుజామున డాలస్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతిచెందాడు. ఎల్బీనగర్ సమీపంలోని బీఎన్ రెడ్డి నగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లాడు. కానీ ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యార్థి మరణం తీవ్ర ఆవేదనను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. విద్యార్థి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.
బాధిత కుటుంబానికి మాజీమంత్రి హరీశ్రావు పరామర్శ
బీఎన్రెడ్డి నగర్లో ఉన్న విద్యార్థి చంద్రశేఖర్ కుటుంబాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. ఉన్నత స్థానంలో ఉంటాడనుకున్న కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి తన గుండె తరుక్కు పోతోందన్నారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలవడం అత్యంత విషాదకరం అన్నారు.