Cheyutha Pensions:తెలంగాణలోని నిరుపేదల, అణగారిన వర్గాల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి అధికారికంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. సామాజిక భద్రతను కల్పించడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందజేయాలని లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే... దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి చివరి తేదీ లేదు. ఇది కంటిన్యూగా సాగా ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎవరు అర్హులు?
ప్రభుత్వం పింఛన్ల మంజూరులో కొన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది. వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల విభాగంలో థలసీమియా, సికిల్ సెల్, హిమోఫిలియో వ్యాధులతో బాధపడుతున్న వారు అప్లై చేసుకోవచ్చు.
అర్హత ప్రమాణాలు, ఆదాయ పరిమితులు
పింఛన్ పొందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ఆర్థికపరమైన రూల్స్ పాటించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం 1.50 లక్షల లోపు ఉండాలి. పట్టణాల్లో ఉండేవారికి ఈ పరిమితి 2 లక్షల వరకు పెంచారు. దరఖాస్తుదారులకు 3 ఎకరాల కంటే ఎక్కవ మాగాణి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉండకూడదు.
ఎవరు అనర్హులు?
ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం కొన్ని అనర్హతలను కూడా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది. ప్రైవేటు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధదిలో పని చేస్తున్న వారు అనర్హులు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు అనర్హులు. పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులు.. ఫోర్ వీలర్ వాహనాలు, లేదా భారీ వాహనాలు ఉన్న వారికి పింఛన్ వర్తించదు. ఇప్పటికే ఇతర ప్రభుత్వ పింఛన్ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు కూడా అనర్హులు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. కొత్తగా పింఛను కోరుకునే వారు కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చేయూత అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఫామ్లో అడిగిన వివరాలను స్పష్టంగా నింపి, సంబంధిత పత్రాలను అటాచ్ చేయాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అందజేయాలి.
- పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, లేదా పురపాలక కమిషనర్లకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
- గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అయితే తమ దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి స్థానిక పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులను సంప్రదించి కన్ఫామ్ చేసుకోవాలి.
సామాజిక భద్రత పింఛన్లు అనేవి సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఒక భరోసా. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, జీవనోపాధి కష్టంగా మారిన మహిళలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా ప్రకటించడం ద్వారా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది.
