Telangana Inter Results 2023: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 13వ తేదీ లోగా రిజల్ట్స్ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నారు. మూల్యాంకనం తర్వాత మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియను త్వరగా ముగించారు. ఇప్పటికే పలు దఫాలుగా ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. ఈ ప్రక్రియలో గత రెండు రోజులుగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, దీన్నిబట్టి ఫలితాల వెల్లడికి ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఫలితాల విడుదల తేదీ ఖరారు కాకున్నా, ఈనెల 13వ తేదీలోగా కచ్చితంగా వెల్లడిస్తామన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనే.. ఫలు దఫాలుగా ఫలితాల విశ్లేషణ, క్రోడీకరణ, కోడింగ్, విదాధాన్ని పరిశీలిస్తామని ఇంటర్ బోర్డు ముఖ్య అధికారి చెప్పారు. 


ఫలితాల వెల్లడికి సంబంధించిన పనులను ఏప్రిల్ 8వ తేదీలోపూ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు బోర్డు సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ అధికారులు కలిసే అవకాశం ఉందని సమాచారం. అదే రోజు పరీక్షల ఫలితాల వెల్లడి సమాచారాన్ని తెలియజేస్తారు. మంత్రి అనుమతి తర్వాత ఫలితాల వెల్లడి తేదీని ఖారారు చేయబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది ఎగ్జామ్స్ రాశారు. సెకండ్ ఇయర్ వాళ్లు 4,65,022 మంది. మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు కలుపుకుని 614, ప్రయివేటు జూనియర్‌ కాలేజీలు 859 ఉన్నాయి. 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు , 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్‌ స్క్వాడ్లను ఇంటర్‌ బోర్డు నియమించి ప్రశాంతంగా పరీక్షలను నిర్వహించింది.


ఇంటర్‌లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందినా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్టియర్‌లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండియర్‌లో 36, 971 మంది విద్యార్థులున్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు పలు మార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్‌ స్కీం కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా 53 వేలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.