Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించి.. దేశం మొత్తం పచ్చగా మారేందుకు ఎంతగానో కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కు అరుదైన గౌరవం దక్కింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 గ్రూపు... గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను గుర్తించింది. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల ఎంపీ హాజరు కాలేకపోయారు. దీంతో శనివారం నెట్స్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి ఎంపీ సంతోష్ కుమార్ ను హైదరాబాద్ లో కలిసి అవార్డును అందజేశారు.


పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్పృహ, అన్ని వర్గాల ప్రాతినిథ్యానికి కృషి చేస్తున్న సంతోష్ పై ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపికైనట్లు న్యూస్ 18 సంస్థ తెలిపింది. పర్యావరణ మార్పుల వల్ల మానవాళికి పొంచి ఉన్న పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు అన్నారు. 






దీనిపై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్.. తనకు అవార్డు అందజేసిన న్యూస్ 18కు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేసిన ఆయన.. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో లక్షలాది మంది భాగమయ్యారని పేర్కొన్నారు. రేపటి భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.