Hyderabad Metro Phase 2 routes finalised: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌మ్యాప్‌ ఖరారు చేశారు. కొన్ని రోజుల కిందట తెలంగాణ సీఎం రేవంత్‌ ఆదేశాలతో అధికారులు హైదరాబాద్ మెట్రో రెండో దశ రూట్‌మ్యాప్‌ (Hyderabad Metro Phase 2 )ను సిద్ధం చేశారు. ఫేజ్ 2లో మొత్తం 70 కిలోమీటర్లలో నగరంలో కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఫేజ్2 ద్వారా నగరం నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ రానుంది. 


చాంద్రయాణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని ప్రతిపాదించారు. నగరంలో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ ఉన్న రెండో కారిడార్‌ చాంద్రయాణగుట్ట వరకు పొడిగిస్తూ అధికారులు ప్రతిపాదనలు చేశారు. మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గం నిర్మాణం చేపట్టేందుకు అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 


మెట్రో విస్తరణ ఇలా ఉండనుంది.. 
- హైదరాబాద్ మెట్రో కారిడార్‌ 2లో భాగంగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (MGBS)  మెట్రోస్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్లు.. అదేవిధంగా ఫలక్‌నుమా నుంచి చాంద్రయాణగుట్ట క్రాస్‌ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు మెట్రో మార్గం నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
- హైదరాబాద్ మెట్రో కారిడార్‌ 4లో నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 29 కిలోమీటర్లు మెట్రో లైన్ విస్తరించాలని ప్రతిపాదించారు. నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్ మీదుగా చాంద్రయాణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్‌దేవ్‌పల్లి మెట్రో నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇదే కారిడార్‌ 4లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరంఘర్ మీదుగా హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు ప్రతిపాదనలు చేశారు.
- కారియర్‌-5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు 8 కిలోమీటర్లు విస్తరించనున్నారు.  రాయదుర్గం నుంచి నానక్‌రామ్‌గూడ, విప్రో జంక్షన్‌ మీదుగా  ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు మెట్రో విస్తరించాలని  ప్రతిపాదించారు.
- హైదరాబాద్ మెట్రో కారిడార్‌ 6లో మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు (Patancheru) వరకు 14 కిలోమీటర్లు మెట్రో లైన్ ప్రతిపాదించారు. మియాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌ నుంచి పటాన్‌చెరు వరకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదన చేశారు. 
- కారిడార్‌ 7లో ఎల్‌బీనగర్‌ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్‌నగర్‌ వరకు 8 కిలోమీటర్ల వరకు మెట్రో వెళ్లేలా ప్రతిపాదనలు చేశారు.