రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థి కిడ్నాప్‌ అంశం తనను షాక్‌కి గురి చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. యువతి భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఆ యువతి ఫ్యామిలీకి భద్రత కల్పించడంతోపాటు యువతిని సురక్షితంగా పేరెంట్స్‌ వద్దకు చేర్చాలని తెలంగాణ డీజీపీని గవర్నర్‌ రిక్వస్ట్ చేశారు.  ఈ మేరకు  ఓ ట్వీట్ చేశారు. 






రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో ఉన్న యువతిని నవీన్‌ రెడ్డి కిడ్నాప్ చేశాడు. డెంటిస్ట్‌గా చేస్తున్న యువతివకి మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తున్నారని తెలుసుకున్న నవీన్ రెడ్డి అనే యువకుడు వంద మంది యువకులతో ప్రియురాలి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులపై దాడి చేసి మరీ బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అయితే కూతుర్ని నవీన్ రెడ్డి అనే యువకుడు వేధిస్తున్నాడని, అతడే కొందరు గూండాలతో తమ ఇంటిపై దాడికి పాల్పడి కూతుర్ని కిడ్నాప్ చేశాడని ఆమె తండ్రి దామోదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అన్యాయం జరిగిందని, పోలీసులు ఫిర్యాదు చేసినా, 100కు కాల్ చేసినా పట్టించుకోకపోవడంతోనే తమ కూతురు కిడ్నాప్ అయిందని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. 


యువతి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను క్షేమంగా ఉన్నానని డెంటిస్ట్ శుక్రవారం సాయంత్రం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. తాను క్షేమంగా ఉన్నానని, తన గురించి ఆందోళన చెందవద్దు అని కిడ్నాప్ అయిన యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేసి చెప్పింది. దాంతో ఇది కిడ్నాప్ కేసు కాదని, ప్రేమ వ్యవహారం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు, యువతి తండ్రి యువతీయువకులు ఉన్న చోటు (నల్గొండ)కు బయలుదేరి వెళ్లారు. కొన్నేళ్లుగా నవీన్ రెడ్డి, డెంటిస్ట్ ప్రేమించుకుంటున్నారని వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.


నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్ !
యువతి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డితోపాటు మరో ముగ్గురు యువకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపైన యువతి ఫోన్ చేయడంతో ట్రేస్ చేసిన పోలీసులు యువతి తండ్రి దామోదర్ రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లారు. యువతి ఇంటిపై దాడికి పాల్పడి ఆమె కుటుంబసభ్యులపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలతో నిందితుడు నవీన్‌ను, మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారని సమాచారం. 


లవర్ కాదు, భార్య అంటున్న నవీన్ రెడ్డి


గత ఏడాది ఆగస్టులో బాపట్లలో మా వివాహం జరిగిందని నవీన్ రెడ్డి చెబుతున్నాడు. వైద్య విద్యార్థి తన భార్య అని, లవర్ కాదని ఇదివరకే పోలీస్ స్టేషన్ లో నవీన్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులకు భయపడి ఆమె వారితోనే ఉంటుందని, భార్యను తన వద్దకు పంపించడం లేదనీ సెప్టెంబర్ 30న లీగల్ నోటీసు పంపినట్లు నవీన్ అంటున్నాడు. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకున్నామని, కానీ ఆమె తల్లిదండ్రులతో నాకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నాడు. ఈ ఏడాది జులై నుండి తల్లిదండ్రులతో ఆమె కలిసి ఉంటుందని, తనను చంపేందుకు వైద్య విద్యార్థి తల్లిదండ్రులు వేరే వారికి సుపారి ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశాడు. పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు ఆమె తల్లిదండ్రులు ధ్వంసం చేశారని అక్టోబర్‌లో ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న ఆమె సోదరుడు తనకు ఎన్ఆర్ఐ సంబంధం తీసుకురావడంతో వివాదం మళ్లీ మొదలైంది.