తెలంగాణలో సాధారణంగానే మద్యం విక్రయాలు అధికంగా ఉంటాయి. అందులో నమ్మర్ అయితే చెప్పాల్సిన పని లేదు. మండుటెండలకు ఉపశమనం కోసం తెలంగాణలో ఏదో కారణంతో బీర్లు పొంగిస్తూనే ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, తేవద్దు.. ఇక్కడ తయారైన బాటిల్స్ మాత్రమే విక్రయించాలని సూచించారు. నగరంలోని రాజేంద్రనగర్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణాపై పలు విషయాలు ప్రస్తావించారు.


విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి  మద్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా సరే కేసులుపెట్టి జైలుకు పంపిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా తెలంగాణ లేబుల్ లేకుండా మద్యం సంబరాలు జరుగుతున్నాయి. దీనివల్ల కల్తీ మధ్యం సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. కల్తీ మద్యం అమ్మడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు మద్యం తీసుకురావడం నేరం అన్నారు మంత్రి. గత వారం రోజుల్లోనే ఇతర రాష్ట్రాల నుంచి 1,333 బాటిల్స్ దిగుమతి అయ్యాయని తెలిపారు.


ఒరిస్సాలో మద్యం అడవుల్లో తయారు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. హర్యాణ నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని కూడా పట్టుకున్నాం అన్నారు. మద్యం అక్రమ రవాణా ప్రమాదకరం అని, విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే ఒక వ్యక్తికి రెండు బాటిళ్లు అనుమతి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మధ్యం సరఫరా చేయడం నేరమని, చిక్కుల్లో ఇరుక్కుంటారని హెచ్చరించారు.  


రేట్లు పెరిగినా బాటిళ్లు ఖాళీ 
భారతదేశ ప్రజలు గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తాకిడిని ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల నుంచి నిత్యావసరాల వరకు అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో, ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లను కూడా తగ్గించుకున్నారు. అయితే, మద్యం విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం గురించి అసలు పట్టించుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), అనేక ఆహార పదార్థాల ధరలతో పాటు ఆల్కహాల్‌ రేట్లు కూడా పెరిగినా, మద్యం ప్రియులను అది ప్రభావితం చేయలేదు. మందుబాబులు ఎక్కువ డబ్బు చెల్లించి మరీ బాటిళ్లు కొన్నారు.


రికార్డ్‌ స్థాయిలో అమ్ముడుబోయిన అన్ని రకాల మద్యం
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ప్రజలు దాదాపు 400 మిలియన్ కేసుల మద్యాన్ని కొనుగోలు చేశారని ఎకనమిక్‌ టైమ్స్‌ తన రిపోర్ట్‌లో రాసింది. సగటున తీసుకుంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మద్యం ప్రియులు 4.75 బిలియన్ల 750 ml బాటిళ్లను కొనుగోలు చేశారు. విస్కీ అయినా, రమ్ అయినా, బ్రాందీ అయినా, జిన్ అయినా, ఓడ్కా అయినా... అన్ని రకాల మద్యం విరివిగా అమ్ముడైందని విక్రయాల లెక్కలు చెబుతున్నాయి. వీటితో పాటు ప్రీమియం బ్రాండ్స్‌, అంటే అధిక ధరల మద్యం విక్రయాలు కూడా ఎక్కువగానే జరిగాయి.


గత రికార్డ్‌ కంటే అమ్మకాలు చాలా ఎక్కువ
గణాంకాల ప్రకారం, 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకు, దేశవ్యాప్తంగా 39.5 కోట్ల మద్యం కేసుల విక్రయాలు నమోదయ్యాయి, ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. 2018-19లో దేశవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. ఆ మద్యం అమ్మకాల రికార్డు 4 సంవత్సరాల తర్వాత బద్ధలైంది.