Telangana Dgp Warning To Drugs Mafia : మత్తు పదార్థాలు (Drugs) సరఫరా (Suppliers) చేసే ముఠాలు (muta), వాటిని వినియోగించే కస్టమర్లకు తెలంగాణ కొత్త డీజీపీ (DGP)రవిగుప్తా (Ravigupta) వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా, వాటిని ఉపయోగించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనలో రాష్ట్ర ప్రజలంతా కలిసి పోరాడుదామన్న ఆయన, ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు కృషి చేస్తోందన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులకు ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రవిగుప్తా... డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.  ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లో డైరెక్టర్ జనరల్ గానూ పని చేశారు. 


హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతి పెరుగుతుండటంతో డ్రగ్స్ కల్చర్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలతోపాటు, స్థానికంగా లభించే గంజాయి వంటివాటి వినియోగం కూడా పెరుగుతోంది. ఆన్ లైన్ లో కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదే హబ్ కావడం, జాతీయ, అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు ఉండటంతో డ్రగ్స్ సరఫరా ఈజీగా జరుగుతోంది. దేశంలోనే తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో జరిగే నేరాలకు డ్రగ్స్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు చాలా సార్లు బయటపడింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా రేవ్ పార్టీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇకపై తెలంగాణలో మత్తుమందు అనే పేరే వినపడకూడదని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. TS-NABలో ఖాళీల భర్తీకి కూడా సీఎం ఆమోదముద్ర వేశారు. మాదకద్రవ్యాల నేరగాళ్లు, అనుమానితులపై సాంకేతికంగా నిఘా పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మత్తుమందుల నియంత్రణకు అనుసరించాల్సిన విధానం, కావాల్సిన సదుపాయాలపై వీలయినంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 


కొత్త సంవత్సరాన్ని క్యాష్ చేసుకునేందుకు డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్స్ ముఠాలు పని చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా డ్రగ్స్ ను తెప్పించుకొని నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో మందుతో పాటు చాలా మంది మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకునేందుకు డ్రగ్స్ మాఫియాలు పావులు కదుపుతున్నాయి. కొత్త సంవత్సరాన్ని మరపురాని విధంగా ఆస్వాదించేందుకు యువత ఎదురు చూస్తున్న యువతకు...ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పబ్బులు, క్లబ్బులు డ్రగ్స్ కోసం కొన్ని సీక్రెట్ కోడ్స్ ను రెగ్యులర్ కస్టమర్లు పంపినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ పోలీసులు...కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ వదిలిపోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన, పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. కొన్ని పబ్‌లలో డ్రగ్స్‌ వాడుతున్నారని, అది వెంటనే ఆపేయకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు.  హైదరాబాద్‌ సిటీని డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తోందన్నారు.