తెలంగాణ(Telangana)లో ధాన్యం కుంభకోణం(Rice Scam)పై సీబీఐ(CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Chief) రేవంత్‌రెడ్డి(Revanth Reddy). కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి బహిరంగ లేఖ రాసిన రేవంత్‌... ఎంక్వయిరీ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 


తెలంగాణలో సీఎం ఆర్‌(CMR) ధాన్యం కుంభకోణంలో టీఆర్‌ఎస్‌(TRS) ప్రభుత్వ ప్రముఖుల పాత్ర ఉందని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి. తాము ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డి కూడా చేశారని గుర్తు చేశారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు. 


టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులుగా చెలమాణి అవుతున్న వాళ్లు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. మార్చి 22 - 24 తేదీల్లో ఎఫ్‌సీఐ(FCI) అధికారులు చేసిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగుచూసిందని వివరించారు. ఈ విషయం మీకు కూడా తెలుసని కిషన్‌ రెడ్డికి గుర్తు చేశారు. 


2020 - 21 యాసంగి, 2021 - 22 వానాకాలం పంటకు సంబంధించిన ధాన్యం నిల్వల విషయంలో అనుమానాలు వచ్చి ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు జరిపారన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4,53,896 బస్తాల ధాన్యం భౌతికంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారన్నారు. 


50 కేజీల బస్తా చొప్పున 2,26,948 క్వింటాళ్లు మిస్‌ అయ్యాయని... దీని విలువ సుమారు రూ.45 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు లెక్క తేల్చారన్నారు రేవంత్‌ రెడ్డి. దీనిని బట్టి ప్రభుత్వం సీఎంఆర్ కింద రైస్ మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యాన్ని వారు మిల్లు బట్టి బియ్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేయకుండా బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 


ఇలా తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో 30 శాతం మేర అవకతవకలు జరుగుతున్నట్టు ఎఫ్ సీఐ అధికారులు గుర్తించిన సంగతి కిషన్‌ రెడ్డి లేఖలో వివరించారు రేవంత్‌రెడ్డి. అదే సమయంలో రేషన్ బియ్యాన్ని రూ.8 -10 చొప్పున కొనుగోలు చేసి, పాలిషింగ్ చేసి అదే బియ్యాన్ని సీఎంఆర్ కింద చూపి ఎఫ్ సీఐకి సరఫరా చేస్తున్నట్టు అధికారుల తనిఖీలలో తేలిందన్నారు. 


ఒప్పందం ప్రకారం 8.34 లక్షల మెట్రిక్ టన్నుల రబీ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని మీడియాకు కిషన్ రెడ్డి తెలిపారని గుర్తు చేశారు రేవంత్. పంట పండలేదా... లేక పండిన పంటను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారా లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారా? అని సందేహ పడ్డారన్నారు. 


బియ్యం గాయబ్ అయ్యాయని మీతోపాటు బీజేపీ(BJP) నాయకులు కూడా చెబుతున్నారన్నారు రేవంత్. అంటే... రాష్ట్రంలో బియ్యం కుంభకోణం జరుగుతోందని మీకు తెలుసున్నారు. ఎఫ్ సీఐ కి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటూ... రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్ సీఐ కి సరఫరా చేస్తున్నట్టు నిర్ధారణైందన్నారు. 


తెలంగాణ వ్యాప్తంగా 3,200కుపైగా రైస్ మిల్లులు ఉన్నాయి... ఇందులో 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైందని వివరించారు రేవంత్. ఇలా గడచిన ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ నేతల అండదండలతో రైస్ మిల్లుల్లో రీ సైక్లింగ్ కుంభకోణం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో... ఎన్ని వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగి ఉంటుందో అంచనా వేసుకోవచ్చన్నారు.


ఇంత స్పష్టంగా కుంభకోణం జరుగుతున్నట్టు ఆధారాలు కనిపిస్తుంటే కేంద్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకునే అధికారం ఉండీ ఎందుకు మిన్నకుంటున్నారని కిషన్ రెడ్డి నిలదీశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌తో రోజూ లడాయి పెట్టుకున్నట్టు ఫోజులు కొడుతున్న బీజేపీ, కేంద్రం ప్రభుత్వం... టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యుల ప్రమేయంతో జరుగుతోన్న ఈ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించ లేకపోతున్నారని ప్రశ్నించారు. 


ఎఫ్ సీఐ ని మోసం చేస్తూ... ప్రజాధనాన్ని లూటీ చేస్తోన్న మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని అడ్డుకుంటోన్న ఆ ఆదృశ్య శక్తులు ఎవరని రేవంత్‌ క్వశ్చన్ చేశారు. టీఆర్ఎస్ నేతల అండదండలతో దందా చేస్తోన్న మిల్లర్లపై సౌమ్యంగా ఉంటున్నారో కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ? 


తెలంగాణలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతోన్న అవకతవకలు, బియ్యం రీ సైక్లింగ్‌పై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలన్నారు రేవంత్ రెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్ సీఐకి చేసిన సప్లై, గాయబ్ అయిన బియ్యం నిల్వలు... అన్నింటిపైనా విచారణ సమగ్రంగా జరగాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన మిల్లులను సీజ్ చేసి... రెవెన్యూ రికవరీ యాక్టు కింద జరిగిన దోపిడీ సొమ్ము మొత్తాన్ని వసూలు చేయాలన్నారు. 


రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యుల పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్‌పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం కాదన్నారు. తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కిషన్‌రెడ్డికి, బీజేపీ నేతలకు సవాల్ చేశారు రేవంత్.