Congress Bus Yatra: ఈ నెల 14వ తేదీ తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడుతుందన్న అంచనాల వేళ.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తలపెట్టిన బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. ఈ బస్సు యాత్రను ప్రారంభించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రానున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన లేదా 10వ తేదీన జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో షెడ్యూల్, రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు.


రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు టికెట్ల విషయంపై బిజీబిజీగా ఉంటున్నారు. ఇదిగో జాబితా, అదిగో జాబితా అంటున్నప్పటికీ.. అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యం అవుతూనే ఉంది. రెండు దఫాలు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు పూర్తి అయిన నేపథ్యంలో.. టికెట్ల ప్రకటన ఈ నెల 14వ తేదీ తర్వాతే తొలి జాబితా ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలోనే తొలి జాబితా విడుదల చేసేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు కసరత్తు చేశారు. అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇంకా జరగాల్సి ఉండటం, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఇంకా జరగకపోవడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. అలాగే పితృపక్షాల కారణంగా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో కూడా అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 14వ తేదీన అమావాస్య ఉండటంతో ఆ తర్వాతే అభ్యర్థుల తొలి జాబితా ఉంటుంది పీసీసీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఈ నెల 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుందని, ఆ తర్వాత 10న సీఈసీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.


మరోవైపు స్క్రీనింగ్ కమిటీ ఒక్కో పేరు పంపిన నియోజకవర్గాలకే తొలుత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. రెండు, మూడు పేర్లు పంపిన సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కో పేరును ఫైనల్ చేసేందుకు సీఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇస్తుందని, ఆ మార్గదర్శకాల మేరకు మళ్లీ స్క్రీనింగ్ కమిటీనే ఒక్కో పేరు సూచించాల్సి వస్తుందనే చర్చ ఏఐసీసీ వర్గాల్లో జరుగుతోంది.


శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్ లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు తెలంగాణలో ఏఐసీసీ కీలక నేతల పర్యటనలపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీలున్నన్ని ఎక్కువసార్లు ప్రియాంక, రాహుల్ గాంధీలతో పాటు ఖర్గే కూడా రాష్ట్రానికి వచ్చేలా షెడ్యూల్ ఇవ్వాలని, కీలక సమయంలో మరోమారు సోనియా గాంధీ కూడా పాల్గొనేందుకు అనుమతి ఇప్పించాలని రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఈ నెల 15 తర్వాత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.