Safran Aircraft Engine MRO Facility | శంషాబాద్: శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ లో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ సాఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) సెంటర్ ను ఆన్ లైన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త MRO యూనిట్కు శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. బెంగళూరు- హైదరాబాద్ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ముఖ్యమం రేవంత్ రెడ్డి భారత ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
సఫ్రాన్కు చెందిన M88 మిలిటరీ ఇంజిన్ MRO కి కూడా శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. ఈ మిలిటరీ MRO భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్లలో ఒకటిగా నిలవనుంది. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎం.ఎస్.ఎమ్.ఈ. విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZల కారణంగా సఫ్రాన్, బోయింగ్, ఎయిర్బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ ప్రపంచ కంపెనీలు తయారీ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు హైదరాబాద్ను ఎంచుకున్నాయి. ఈ కారణంగానే హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ MRO, ఏరో ఇంజిన్ హబ్లలో ఒకటిగా రూపుదిద్దుకుందన్నారు.
‘ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధిని వివరిస్తూ, గత ఏడాది మన ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. కేవలం 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు చేరుకున్నాయి. మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను అధిగమించడం విశేషం. తెలంగాణ ఇప్పటికే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఏరోస్పేస్ అవార్డును అందుకుంది. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం (స్కిల్లింగ్) చాలా ముఖ్యమైన ప్రమాణమని గుర్తించిన ప్రభుత్వం టాటా టెక్నాలజీస్తో భాగస్వామ్యం చేసుకుంది. రాష్ట్రంలోని 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను (ఐటీఐఎస్) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతుందని’ రేవంత్ రెడ్డి తెలిపారు.
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణంరాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రం ఈ విజన్ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ‘తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్’ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ ఆహ్వానించారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.