Telangana Rising 2047 | హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్ లో కనిపించాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి ( CURE), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ( RARE)గా 3 రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైసింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Continues below advertisement

డిసెంబర్ 8, 9 తేదీల్లో రైజింగ్ సమ్మిట్రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను లక్ష్యంగా చేసుకుని విజన్ 2047 కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రానున్న 22 ఏళ్ల కోసం రూపొందించనున్న ఈ భవిష్యత్ కార్యాచరణ, అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి అనే లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, నగరాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చి, దాని భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.

Continues below advertisement

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025పై సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, సీతక్కతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం ముఖ్య లక్ష్యం, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడం.. ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను షోకేస్ చేయడం. అందుకే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం  ఫ్యూయర్ సిటీలో నిర్వహించాలని యోచిస్తోంది. వివిధ రంగాలలో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను ఈ సదస్సులో వివరించడంతో పాటు, ప్రభుత్వం అందించే వివిధ రూపాల ప్రోత్సాహకాలను ప్రకటించనుంది.

తెలంగాణ రైజింగ్ విజన్ 2047: లక్ష్యాలు, వ్యూహంప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దార్శనిక విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మార్గదర్శకంగా మారనుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను తయారుచేస్తున్నారు. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి, స్థిరమైన అభివృద్ధి అనే ఈ మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం కేంద్రీకరించింది. భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. చిన్న రాష్ట్రమైనప్పటికీ, ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలపాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించింది. అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో కాదు, చైనా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడే లక్ష్యాలతో ముందుకుపోతోంది.

ఆర్థిక వృద్ధికి కీలక రంగాలు, పెట్టుబడి ఆకర్షణఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, MSMEలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాలు రాబోయే 2 దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సులభంగా అనుమతులు (Ease of Doing Business), గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు మొదటి గమ్యస్థానంగా నిలపనున్నాయి. ఈ బలాలను పునాదిగా చేసుకుని, మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండబోతోంది. అభివృద్ధి సమతుల్యత సాధించడానికి, హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణను 3 జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో, గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా విజన్ డాక్యుమెంట్‌లో భాగం కానుంది.

మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధి, మౌలిక సదుపాయాలురాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారతను అత్యంత ప్రధానమైన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. అందుకే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై కూడా ఈ విజన్ డాక్యుమెంట్ దృష్టి పెడుతోంది, అందుకోసం నెట్-జీరో తెలంగాణను అవిష్కరించనుంది. బ్లూ & గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్ మూసీ పునరుజ్జీవం, దానిలో భాగంగా 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాలలో స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేయనుంది.

సీపోర్టుకు హైవే అనుసంధానం, మానవ వనరుల అభివృద్ధిఆధునిక రవాణా మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయనుంది. హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించనుంది. రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతోంది.

హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు అత్యాధునిక హైవేను నిర్మించి సీపోర్టుకు అనుసంధానం చేయబోతోంది. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌తో పోటీపడేలా ప్రతి ఏటా రెండు లక్షల తెలంగాణ యువతకు, లక్ష మంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధిని లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజ్‌లను నిర్మిస్తారు. మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

టూరిజం, కల్చర్, గ్లోబల్ బ్రాండింగ్అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్‌ను క్రియేట్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. బతుకమ్మ, బోనాలు (Bonalu), డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని లక్ష్యం. ప్రతి గ్రామంతో పాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండబోతోంది.