Telangana CM Revanth Reddy : జులై, ఆగస్ట్ నెలల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న వేళ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కో రోజు ఒక్కో చోట అంచనాలకు మించిన భారీ వర్షం కురుస్తోందని అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకే వర్షాలు కురిసే ఈ రెండు నెలలపాటు అన్ని విభాగాల అధికారులు జిల్లాల్లో అందుబాటులో ఉండాలన్నారు. సమన్వయంతో పనిచేయాలని హితబోధ చేశారు. అదమరచి ఉండకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అందించే వాతావర సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని తెలిపారు. దీనికి కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు. దీంతో కనీసం మూడు గంటల ముందే రైతులు, ప్రజలను అప్రమత్తం చేసే వీలుకలుగుతుందని చెప్పుకొచ్చారు.
జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 శాతం తక్కువగా వర్షపాత నమోదు అయినట్టు సీఎం వివరించారు. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని... ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు, నీరు నిల్వ ఉన్నచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విభాగాలు మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేలా జీహెచ్ఎంసీతోపాటు పోలీస్, ట్రాఫిక్ విభాగాలు, ఎన్డీ ఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధ్వర్యంలోని 150 టీమ్లు వెంటనే రంగంలోకి దిగాలని చెప్పారు. సిబ్బందితోపాటు అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్లతోపాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా జిల్లా కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకోవాలన్నారు.
జిల్లాల పరిధిలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొన్నిచోట్ల పిడుగుపాటుతో చనిపోతున్న వార్తలు వస్తున్నాయన్నారు. అటువంటి వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. భవిష్యత్తులో వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించే వీలుంటుందని తెలిపారు.
వర్షాల సీజన్లో డెంగీతోపాటు సీజనల్ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం. "గిరిజన ప్రాంతాలు, ఐటీడీఏ ఏజెన్సీ ఏరియాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. పీహెచ్ సీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా ప్రజలకు ఆపద వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలి. ప్రతి జిల్లా కలెక్టర్ ఖాతాలో రూ. కోటి అత్యవసర నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుంది." "కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని పీహెచ్సీల నుంచి జిల్లా ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయాలి. ప్రతి రోజు ఉదయం పూట క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాలి. ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి సీఎస్ ప్రభుత్వానికి రిపోర్టు అందించాలి." అని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అజాగ్రత్తగా ఉంటే ఉపేక్షించేది లేదు: రేవంత్
జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలన చెప్పారు రేంత్ రెడ్డి. "నీటి నిల్వలను అంచనా వేసుకోవాలి. వర్షాలకు అనుగుణంగా నీటి వినియోగ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. చెరువులు, కుంటలకు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి."
కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైందన్నారు రేవంత్. త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తామని తెలిపారు. గతేడాది రికార్డు స్థాయిలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని గుర్తు చేశారు. యూరియా కృత్రిమ కొరత ప్రచారానికి కలెక్టర్లు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని... రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆగస్టు కోటా కూడా త్వరలోనే రాష్ట్రానికి సరఫరా అవుతుందని తెలిపారు. యూరియా స్టాక్ వివరాలను డీలర్లు, షాప్ల వద్ద బోర్డుపై డిస్ ప్లే చేయాలన్నారు. స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
యూరియా అమ్మకాలు సాఫీగా సాగేలా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల డీలర్లు, షాపుల వద్ద ఇద్దరు అధికారులు, ఇద్దరు పోలీసులను అందుబాటులో ఉంచాలన్నారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను మళ్లిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని... ఇటీవలే కేంద్రమంత్రి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను మళ్లిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని... కేసులు పెట్టాలని ఆదేశించారు. ఎరువులకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.
రైతులు, పేద ప్రజల ఏదీ ముఖ్యం కాదు: రేవంత్
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ప్రారంభమైందని... సన్న బియ్యం పంపిణీతో గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు, రేషన్ షాపుల విలువ పెరిగిందన్నారు రేవంత్. రాష్ట్రంలో దాదాపు 7 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని... దీంతో దాదాపు 31 లక్షల కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేద ప్రజలు ఆహార భద్రత గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96 లక్షల కార్డులతో 3.10 కోట్ల మంది సన్న బియ్యం తీసుకుంటున్నారని అన్నారు. "పేదలకు సన్న బియ్యం అందించే ఈ రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించాలి. ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. జిల్లా ఇన్ ఛార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కొత్త కార్డుల పంపిణీలో పాల్గొనాలి. ప్రతీ మండలంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి."
జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక చోట జిల్లా ఇన్ఛార్జీ మంత్రి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని రేవంత్ రెడ్డి సూచించారు. అందుకు వీలుగా షెడ్యూలును కలెక్టర్లు తయారు చేసి రేషన్ కార్డుల పంపిణీ విజయవంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సెక్రెటేరియట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్షరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, సీతక్క, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.