హైదరాబాద్: రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం, వ్యయాల వివరాలను మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.  


కోడ్ ముగిసేలోపు నిధులు సేకరించండి..
తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించాలని అధికారులకు సూచించారు. రుణమాఫీకి కావాల్సిన నిధులను సమకూర్చుకునే వివిధ మార్గాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని సీఎం ఆదేశించారు.  


రైతులను రుణాల నుంచి విముక్తి చేయాలని రాష్ట్ర  ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. దాంతో నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే  బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సైతం సూచించారు. రైతు రుణమాఫీ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్,  ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. 


రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు 
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ లో వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులు కల్లాల వద్ద ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని మంత్రులు, అధికారులకు సూచించారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలన్నారు.