Telangana CM Revanth America Tour: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దాన్నే చూపించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఫ్యూచర్ సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా అభివృద్ధఇ చేస్తామని చెబుతున్నారు. అత్యాధునిక హంగులతో కాలుష్యానికి, ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఈ సిటీ నిర్మించబోతున్నట్టు వారికి వివరిస్తున్నారు. 


సమస్యల్లేని నాల్గో నగరం 


అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ముచ్చెర్లలో ఏర్పాటు చేయబోయే పోర్ట్ సిటీని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న మూడు సిటీల్లో భారీగా కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున చాలా కంపెనీలు రావడానికి ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే నాల్గో సిటీని తెరపైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పరిచయం చేస్తున్నారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ హబ్‌తోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొంటున్నారు. మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విభాగాలు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వారికి హామీ ఇస్తున్నారు. 


పారిశ్రామికవేత్తలతో ముచ్చెర్ల సిటీపై చర్చలు 


న్యూయార్క్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఫార్మా, బయోటెక్, ఐటీ, టెక్నాలజీ, షిప్పింగ్‌, ఈవీ రంగాలకు చెందిన కంపెనీ ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వారికి కావాల్సిన ఎమినిటీస్‌ గురించి చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి సమస్య రాకుండూ చూస్తామని, కంపెనీ విస్తరణ ప్రక్రియను కూడా సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. 


ప్యూచర్‌ సిటీలో పెట్టుబడులు, వివిద పారిశ్రామికవేత్తల అవసరాలు, వారి సూచనలు, ప్రభుత్వ ఆలోచనలతో సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఒక్క హైదరాబాద్ కాకుండా తెలంగాణలోని చాలా జిల్లాలు పారిశ్రామిక ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయని వాటిని క్లస్టర్లుగా విభజించి ప్రగతిపథంలోకి తీసుకొస్తామన్నారు రేవంత్. అందుకే పారిశ్రామికవేత్తలంతా తెలంగాణ వస్తే కలిసికట్టుగా పని చేసి అన్నిరంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌లో నిలుపుదామని పిలుపునిచ్చారు. 


తెలంగాణకు స్వచ్ఛ్‌ బయో


అనంతరం పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ఒప్పందలపై సంతకాలు చేశాయి. అలాంటి వాటిలో బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్‌ బయో ఒకటి. తెలంగాణ సెకండ్‌ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్‌ను ఏర్పాటుకు ఓకే చెప్పింది. తొలి దశలో వెయ్యి కోట్ల పెట్టుబడిలో ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ప్లాంట్‌ నిర్మాణంతో 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 


హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ గ్రీన్ సిగ్నల్


తెలంగాణలో ఆర్సీసియం కంపెనీ తొలిసారిగా విస్తరించేందుకు ఓకే చెప్పింది. ఈ కంపెనీ రాకతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు దొరబోతున్నాయి. హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ అనే సంస్థ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను హైదారాబాద్‌లో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే 2024 మార్చిలో ఇంక్యుబేషన్‌ ఫెసిలిటీని స్టార్ట్ చేసింది. ట్రైజిన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ హైదరాబాద్‌లో తమ ఏఐకు సంబంధించిన ఇన్నోవేషన్‌ అండ్‌ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వచ్చే మూడు ఏళ్లలో వెయ్యి మందికిపైగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఆరు నెలల్లోనే కంపెనీ వర్క్స్ ప్రారంభంకానున్నాయి.