KTR comments in Pressmeet | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు ఫాం ఫౌస్‌లు ఉన్నాయని, తనకు ఏ ఫాం హౌస్ లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్నేహితుడి ఫాం హౌస్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. తెలంగాణలో నిబంధనలు పాటించకుండా కట్టిన ఫాం హౌస్ లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు మీద ఏ ఫాం హౌస్ లేదని, తనకు అసలు ఫాం హౌస్ లేదని క్లారిటీ ఇచ్చారు.


సీఎం రేవంత్ రెడ్డికి ఫాం హౌస్ ఉంది..


తన స్నేహితుడి వద్ద లీజుకు తీసుకున్న ఫాం హౌస్ నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఒకవేళ ఆ ఫాం హౌస్ కనుక FTL, Buffer Zone లో ఉన్నట్లయితే ఫ్రెండ్ కు చెప్పి, ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని కోరతానన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఫాం హౌస్ లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. కేవీపీ, మహేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఫాం హౌస్ లు ఉన్నాయని.. అవసరమైతే అవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తాయన్నారు. జన్వాడతో ఇతర ఫాం హౌస్ లపై అక్కడే కూర్చుని అన్ని వివరాలు పరిశీలించి, చర్యలు తీసుకుందామా అంటూ సవాల్ విసిరారు.


అలాగైతే ఆ ఫాం హౌస్ కూల్చేసినా ఓకే..


జన్వాడ ఫామ్ హౌస్‌ను హైడ్రా కూల్చివేస్తుందనే కథనాలపై కేటీఆర్ స్పందించారు. తన స్నేహితుడికి ఓ ఫాం హౌస్ ఉంటే తాను ఏడెనిమిదేళ్లు లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ ఫాం హౌస్ బఫర్ జోన్‌లో ఉంటే కనుక తాను స్వయంగా వెళ్లి తన మిత్రుడితో మాట్లాడి... దగ్గర ఉండి మరీ కూలగొట్టించి వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే అందరికీ ఒకే న్యాయం ఉండాలని, ఆ ఫామ్ హౌస్ కూల్చివేసిన తర్వాత.. నేరుగా వచ్చి మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో కట్టిన నిర్మాణాలను కూడా కూల్చివేయాలని ఛాలెంజ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డిలకు సంబంధించిన నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తమకు ఏ ఇబ్బంది లేదన్నారు. పలువురు కాంగ్రెస్ నేతల ఫాం హౌస్ లు నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయని.. తెలంగాణ ప్రభుత్వం వాటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు.


రుణమాఫీ చేయమని అడిగిన రైతుల మీద కేసులు పెట్టి వాళ్లని వేధిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.  రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే ఏళ్లు జైశిక్ష పడేలా సెక్షన్ 126, రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడేలా సెక్షన్ 189, ఏడాది జైలుశిక్ష పడే విధంగా సెక్షన్ 223ల కింద రైతుల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ అంతా బూటకమని, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రుణమాఫీపై కాకి లెక్కలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.


Also Read: Telangana: వరంగల్ బీఆర్‌ఎస్‌లో డిష్యూం డిష్యూం- ఒకరు కేసీఆర్‌కు సన్నిహితులు మరొకరు కేటీఆర్‌ ఫ్రెండ్‌