Revanth Reedy: హైదరాబాద్‌లో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించిన సీతారాం ఏచూరి పేదల పక్షాన గళం విప్పారన్నారు. అలాంటి వ్యక్తి మరణం తీరని లోటని అభివర్ణించారు. 


ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి సీతారాం ఏచూరిని కలిసి మాట్లాడినప్పుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారన్నారు రేవంత్ రెడ్డి. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసమే చివరి శ్వాస వరకు నిలబడిన వ్యక్తి అంటూ గుర్తు చేశారు. 
సీతారాం ఏచూరి బ్రతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారన్నారు రేవంత్ రెడ్డి. మరణాంతరం కూడా ఉపయోగపడాలన్న కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పదని అభిప్రాయపడ్డారు. యూపీఏ హయాంలో  పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. ఆయన్ను మార్గానిర్దేశకుడిగా రాహుల్ గాంధీ భావిస్తారని వివరించారు.


ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో కీలక మారుతున్న జమిలీ ఎన్నికలపై కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలన్న కుట్ర జరుగుతోందన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలనుకుంటున్న ఇలాంటి కీలక సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరని లోటన్నారు. 


రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు రేవంత్ రెడ్డి. దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. విద్యార్థి దశ నుంచి దేశ క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. 


సీతారాం ఏచూరి స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలన్నారు రేవంత్. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మాట్లాడితే ప్రధాని స్పందించకపోవడం వారి ఫాసిస్టు విధానాలకు నిదర్శనమన్నారు. అలాంటి భాషా ప్రయోగం చేసిన వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.