Telangana CM Revanth Reddy: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రాజకీయ పార్టీల వలలో పడి సంస్థకు నష్టం చేసే పనులు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ... ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఏడాది తిరిగే సరికి సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కీలకమైన సమయంలో సమ్మె ఆలోచన చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ ఆదాయాన్ని కార్మికుల చేతుల్లోనే పెట్టేస్తామని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చర్చిద్దామని సూచించారు.
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. మేడే సందర్భంగా ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడమని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంస్థ అని దీన్నికాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు.
రాష్ట్రంలో పదళ్లు ఆర్థిక దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆర్టీసీలో గత పదేళ్లు భారీ విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవద్దని హితవుపలికారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రితో చర్చించి పరిష్కరించుకోవాలని తెలిపారు. వచ్చే ఆదాయమంతా కార్మికుల చేతిలో పెడతామని ఎలా ఖర్చు చేద్దామో సూచనలు చేయాలని సూచించారు. అణాపైసా కూడా ఇంటికి తీసుకెళ్లేది లేదని కార్మికుల కోసమే ఖర్చు చేస్తామన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఒకసారి ఆలోచించాలని సూచించారు. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందని మరో ఏడాదిలో కుదురుకుంటుందని వివరించారు.
పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దని ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దన్నారు. నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటా అని ఆర్టీసీ కార్మికులు భరోసా ఇచ్చారు.
కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని అభివర్ణించారు. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నామని వెల్లడించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే కార్మికుల సహకారం మరువలేనిదిగా చెప్పారు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానిదనని గుర్తు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
కార్మికులకు మేలు చేయడమే ప్రభుత్వ విధానమని అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నామన్నారు. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపిందని ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు.
గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారని తెలిపారు రేవంత్. 1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారని వివరించారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో 8 లక్షల 29 వేల కోట్లు ఉందని చెప్పారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలిందన్నారు.
ఇంత చేసిన కేసీఆర్ ఇప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్. కెసిఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదని తెలిపారు. అసెంబ్లీకి పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండని డిమాండ్ చేశారు. కపటనాటక సూత్రధారి మళ్లీ బయల్దేరాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.