Telangana Cabinet Decisions | హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు సౌదీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సాయం, ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలవడం సహా తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దుర్ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టేందుకు, మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించింది. చనిపోయినవారి మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, అందుకు బాధిత కుటుంబ సభ్యులలో ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

Continues below advertisement

అందెశ్రీ కుమారుడికి ఉద్యోగం

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణించడంతో ఆయన కుటుంబానికి అండగా ఉండేందుకు కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. అందెశ్రీ కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావి తరాలకు తెలియజేసేలా రాష్ట్రంలో అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అందెశ్రీ రచించిన "జయ జయ హే తెలంగాణ" గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Continues below advertisement

గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమంగిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును) రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్‌ఫామ్ బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. వీరు మొబిలిటీ, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో, అలాగే ఇళ్లలో పనివాళ్లుగా పని చేస్తున్నారు. ఈ కార్మికులకు ఎటువంటి సెలవులు లేకపోగా, రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. వీరికి ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, చెల్లింపుల విషయంలో స్పష్టమైన విధానాలు లేవు. గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 డిసెంబర్ 23న గిగ్ వర్కర్లు, సంబంధిత ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో పలుమార్లు సంప్రదింపులు జరిపి గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం అందుబాటులో ఉంచగా, దాదాపు 64 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం రూపొందించిన బిల్లును ఈ రోజు కేబినెట్ ఆమోదించింది. ఈ కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభిస్తాయి. వీరందరి సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి హక్కులకు రక్షణ కల్పిస్తుంది. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, వారికి చట్టబద్ధంగా లభించాల్సిన అన్ని అంశాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో గిగ్ వర్కర్ల సంక్షేమానికి కొంత ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ మంత్రివర్గం ప్రస్తుతం ఆమోదించిన బిల్లు జాతీయ స్థాయిలో మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.

పంచాయతీ ఎన్నికలు, రిజర్వేషన్లుగ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న క్రమంలో వీలైనంత తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి వచ్చే 2026 మార్చి 31 తో ముగియనుంది. అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి. అందుకే ఈ డిసెంబరు నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ఇచ్చింది. దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. అయితే కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. 

ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇతర ముఖ్య నిర్ణయాలుఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఇకపై రాంరెడ్డి దామోదర్ రెడ్డి (RDR) ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కెనాల్ అని పేరు మారుస్తారు.

ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను మల్టీ యూజ్ జోన్స్‌గా మార్చేందుకు రూపొందించిన "హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)" కి కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా... డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8వ తేదీన ప్రజలకు వివరించే కార్యక్రమాలుంటాయి. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.