హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాను మరింత సులువు చేయడానికి నగరంలో చేపట్టాలని తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ మెట్రోను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు. కొన్ని మార్గాల్లో కింది నుంచి రోడ్డు, పై నుంచి మెట్రో రైలు వెళ్లేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో ప్రజా రవాణా దేశంలోనే అత్యంత మెరుగ్గా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్ వివరించారు.


మెట్రో విస్తరణ ఇలా..
మెట్రో విస్తరణలో భాగంగా మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో ఇటు ఇస్నాపూర్ వరకూ, అటు పెద్ద అంబర్ పేట్ వరకూ (విజయవాడ మార్గంలో) మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.  నిజామాబాద్ మార్గంలో జేబీఎస్ నుంచి కండ్లకోయ (ఓఆర్ఆర్) వరకూ విస్తరిస్తామని వివరించారు. 


ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ పనులకు శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కందుకూరు వరకూ మెట్రోను పొడిగిస్తామని వివరించారు. ఇటు వరంగల్ మార్గంలో తార్నాక నుంచి యాదాద్రి జిల్లా బీబీ నగర్ వరకూ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకూ మెట్రో లైనును పొడిగిస్తామని వివరించారు. 


రూ.60 వేల కోట్లతో
ఈ మొత్తం పొడిగింపులు అన్నీ రూ.60 వేల కోట్లతో చేపడతామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇంతకుముందు నిర్ణయించిన 101 కిలో మీటర్లకు అదనంగా ఈ కొత్త మెట్రో రైలు పొడిగింపులు ఉంటాయని చెప్పారు. రాబోయే మూడు లేదా నాలుగు ఏళ్లలో ఇవి పూర్తి చేయాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేయాలని మున్సిపల్ శాఖను కేసీఆర్ ఆదేశించినట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. 


డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు
జేబీఎస్ నుంచి తూంకుంట వరకూ ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (ఒక లెవెల్ లో వాహనాలు వెళ్లేలా, మరో లెవెల్ లో మెట్రో రైలు వెళ్లేలా) ఏర్పాటు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. పాతబస్తీలో మెట్రో కూడా పూర్తి చేస్తామని వివరించారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వ్యవస్థను కూడా నిర్మిస్తామని వివరించారు.


పాట్నీ నుంచి కండ్లకోయ వరకూ మరో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించినట్లుగా కేటీఆర్ చెప్పారు. ఈ మార్గంలో కంటోన్మెంట్ ఏరియాలో భూములు కూడా సేకరించాల్సి ఉన్నందున ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లుగా వివరించారు.


2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే


ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్లుగా కేటీఆర్ చెప్పారు. అన్ని నగరాల్లో మెట్రో పొడిగింపులకు కేంద్రం సహకరించినట్లుగానే తమకు సాయం చేస్తుందని అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఒకవేళ కేంద్రం సాయం చేయకపోయినా తాము ఆ పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. ‘‘2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎలాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కాబట్టి, అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడు రాష్ట్రానికి కావాల్సిన సహకారం అందుతుంది’’ అని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.