Supreme Court: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా చేస్తున్న విచారణ ముగించింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్న వాదనతో ఏకీభవించింది. ఈ కేసు విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది బీఆర్ఎస్కు షాకింగ్ నిర్ణయంగానే చెప్పవచ్చు.
అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరిగింది?
జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, ఇవాళ తుది విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను బలంగా వినిపించారు.
సింఘ్వీ తన వాదనల్లో ప్రధానంగా ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన స్పీకర్ కార్యాలయానికి అందిన పిటిషన్లపై ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ జరిగిందని, స్పీకర్ ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన ధర్మాసనానికి వివరించారు. స్పీకర్ స్థాయిలోనే ఈ ఫిర్యాదులు పరిష్కారం అయినందున, ఇక న్యాయస్థానంలో వీటిపై విచారణ అవసరం లేదని ఆయన కోరారు.
సుప్రీంకోర్టు నిర్ణయం, కీలక ఆదేశాలు
న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సమర్పించిన వివరాలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సంజ్ కరోల్ ధర్మాసనం, స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై తీర్పు వెలువరించినందున, ఇకపై ఈ పిటిషన్లను విచారణలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు భావించింది.
దీంతో బీఆర్ఎస్ దాఖలు చేసిన ఈ ఫిరాయింపులు పిటిషన్లపై విచారణ ముగిసినట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియలో పారదర్శకతను నిర్దారిస్తూ కోర్టు ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన తీర్పు కాపీలను రాబోయే రెండు రోజుల్లో ఫిర్యాదుదారులకు అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది.
కేసు బ్యాక్ గ్రౌండ్ ఇదే
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. తమ పార్టీ గుర్తుపై గెలిచి, ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలోనే స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో, న్యాయపరంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు విచారణ ముగించి స్పీకర్ నిర్ణయానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఆర్డర్ కాపీలు అందిన తర్వాతే రాజకీయ చదరంగంలో తదుపరి అడుగులు ఎటు పడతాయనేది తేలనుంది.
