Vijayashanti: భారతీయ రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ పేరు చెబితే మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని.. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా కోట్ల రూపాయలు పంచి అదే స్థాయిలో ముందెన్నడూ అక్కడ లేని విధంగా ఇతర రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చేయ్యాల్సిన దుర్మార్గ పరిస్థితిని తీసుకువచ్చారని మండిపడ్డారు. మున్ముందు దేశం అంతటా ఇదే రకం వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ పేరుతో తీసుకువస్తారని అన్నారు. తెలంగాణలో దోపిడీ చేసిన లక్షల కోట్ల అవినీతి ధనం అండతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికలకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని కేసీఆర్ వెళ్తున్న విధానం, మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేస్తుందని అన్నారు. ఇది నియంతృత్వ ప్యూడల్ ధోరణికి దారి తీస్తున్న పరిస్థితి కావొచ్చేమోనని ట్వీట్ లో పేర్కొన్నారు. 






అటు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని కూడా వెయ్యి కోట్ల ప్రలోభంతో మోసగించి దెబ్బ తియ్యాలనే ప్రయత్నాన్ని కొన్ని పత్రికలు వార్తలుగా ఇచ్చాయని తెలిపారు. ఇక అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ కుటుంబం ఢిల్లీ, పంజాబ్ లలో తెచ్చిపెట్టిన స్కాముల సమస్యతో ఆప్ అసలుకే నాశనం అయ్యేట్లు అనిపిస్తోందని విజయశాంతి ట్వీట్ చేశారు. 


"బీఆర్ఎస్ పేరు చెబితే భయపడుతున్న మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు.. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.. మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా కోట్ల రూపాయలు పంచి ఒక్క స్థానం కూడా గెలవక ఓడిపోయినప్పటికీ.. అదే స్థాయిలో ముందెన్నడూ అక్కడ లేని విధంగా ఇతర రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చెయ్యవలసిన దుర్మార్గాన్ని తయారు చేసి, రేపటి రోజు దేశమంతా ఇదే భ్రష్టాచార వ్యవస్థను బీఆరెస్ పేరుతో, తెలంగాణలో దోపిడీ చెయ్యబడ్డ లక్షల కోట్ల అవినీత ధన తోడ్పాటుతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు మేమే భరిస్తామని కేసీఆర్ గారు వెళ్తున్న విధానం, మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేసి, నియంతృత్వ ఫ్యూడల్ ధోరణికి దారి చేస్తున్న పరిస్థితి కావచ్చేమో అని తప్పక అనిపిస్తున్నది.


ఇది చాలదన్నట్లు ఏపీలో జనసేన వంటి పోరాడే పార్టీని కూడా వెయ్యి కోట్ల ప్రలోభంతో (జనసేన అసహ్యించుకుని స్పందించనప్పటికీ..) మోసగించి దెబ్బ తియ్యాలనే మీ ప్రయత్నం ఆంధ్రజ్యోతి వంటి అగ్రశ్రేణి దినపత్రికలలో వార్తలుగా వచ్చింది. ఇక అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి మీ బీఆరెస్ కుటుంబం ఢిల్లీ, పంజాబ్‌లలో తెచ్చిపెట్టిన స్కాంల సమస్యతో ఆప్ అసలుకే నాశనమయ్యేట్లు అనిపిస్తున్నది నేటి.. రేపటి నిజం"
- విజయశాంతి