తెలంగాణ సీఎం కేసీఆర్ చిల్లర బుద్ధిని చూడలేకే కేంద్ర ప్రభుత్వం నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని కేసీఆర్ (Telangana CM KCR) చిల్లర వ్యవహారంగా పేర్కొనడాన్ని ఆయప తప్పుపట్టారు. నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశని, రాజ్యాంగ స్పూర్తి మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందన్నారు.


గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నది వాస్తవం కాదా? కేంద్ర నిధులను జీతాలకు మళ్లిస్తోంది నిజం అన్నారు. గ్రామాల్లో చేసిన అభివ్రుద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజం కాదా? కేసీఆర్ చేతగానితనంవల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.


ప్రజలకు ఎంతో కీలకమైన వైద్యం, విద్య సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్ది దారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్ ది చిల్లర బుద్ది కాక ఏమనాలి అన్నారు.


‘ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులివ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నది కేసీఆర్. తండాలను పంచాయతీలుగా మార్చి నిధులివ్వకుండా తండాలను నిర్వీర్యం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ అవినీతిని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులపై నిలదీస్తున్న సర్పంచులపై అక్రమంగా కేసులు పెట్టి సస్పెండ్ చేస్తున్న మాట నిజం కాదా? కేసీఆర్ కుటుంబ అవినీతికి మడుగులొత్తే ప్రజా ప్రతినిధులను అందలమెక్కిస్తూ.. ఇతర పార్టీల సర్పంచులు-ఉప సర్పంచుల మధ్య కొట్లాటి పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తున్న విషయం వాస్తవం. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకుని తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించి అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమన్నారు. 






జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తున్నా... వాటిని నెలల తరబడి చెల్లించకుండా కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రజా సంగ్రామ యాత్రలో అనేక చోట్ల ఉపాధి కూలీలు వచ్చి తమకు ఉపాధి కూలీ సొమ్ము అందడం లేదంటూ గోడు వెళ్లబోసుకున్నారు. కష్టాల్లో పేదలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు కేంద్రం ప్రతినెలా 5 కేజీల బియ్యం ఉచితంగా పంపిస్తే... వాటిని అందకుండా చేసి పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నది కేసీఆర్ కాదా?. గ్రామాల్లో ఎల్ఈడీ బల్పుల కోసం నిధులిస్తే... కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఒకే సంస్థకు కట్టబెట్టేలా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలంటూ హుకూం జారీ చేసింది నిజం కాదా?. కేంద్రం నుండి రాష్ట్రాలకు వికేంద్రీకరణ జరగాలని నీతులు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాల నుండి గ్రామాలకు నిధులు, విధులను ఎందుకు వికేంద్రీకరించడం లేదో రాష్ట్ర ప్రజలకు ముందు సమాధానం చెప్పాలని’ బండి సంజయ్ డిమాండ్ చేశారు.


గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, స్మశాన వాటికలు, పల్లె  ప్రక్రుతి వనాలు, మరుగు దొడ్లు, డంపింగ్ యార్డులకు కేంద్రం నిధులిస్తున్న మాట వాస్తవం కాదా? ఆయా నిధుల్లోనూ అవినీతికి ఆస్కారం ఇచ్చేలా నచ్చిన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై సర్పంచులు పెద్ద ఎత్తున గళమెత్తడంతోపాటు నేరుగా పంచాయతీలకు నిధులివ్వాలంటూ కేంద్రానికి లేఖలు రాసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. వికేంద్రీకరణే లక్ష్యంగా కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిస్తుంటే... ఓర్వలేక కేసీఆర్ పిచ్చిప్రేలాపనలు చేయడం సిగ్గు చేటు అంటూ మండిపట్టారు.


 గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి కేసీఆర్. జాతీయ పంచాయతీ రాజ్ దివస్  సందర్భంగా అన్ని రాష్ట్రాలు ఏటా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఫాంహౌజ్ కే పరిమితమైన  సీఎం కేసీఆర్ మాత్రమే. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా  కాశ్మీర్ వ్యాలీలోని ఓ కుగ్రామానికి వెళ్లిన ప్రధాని మోదీ.. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని పంచాయతీల ప్రాముఖ్యతను చాటిచెప్పారని గుర్తు చేశారు.