Telangana Latest News: కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ సమస్యల క్లియరెన్స్ కోసం తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రజాభవన్‌లో ఆల్‌పార్టీ ఎంపీల సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మాత్రమే హజరయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్ దూరంగా ఉన్నాయి. 

Continues below advertisement


హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో 28 అంశాలు చర్చించారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు ఏంటీ అవి ఏ స్థాయిలో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మల్లు భట్టి విక్రమార్క వివరించారు. రావాల్సిన నిధులు, మంజూరు కావాల్సిన అనుమతలపై ఇప్పటికే ప్రధాన మంత్రి సహా వివిధ మంత్రులకు రిప్రజంటేషన్లు ఇచ్చామని ఎంపీలకు భట్టి తెలిపారు. 


నాడు వాళ్లు సీరియస్‌గా తీసుకోలేదు: భట్టి విక్రమార్క 


9 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సరైన విధంగా డీల్ చేయకపోవడంతోనే చాలా అంశాలు పెండింగ్‌లో ఉండిపోయాయని అన్నారు భట్టి. అందుకే వాటి కోసం పలు మాత్రం కేంద్రం చర్చించినట్టు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసిన ఒత్తిడి కారణంగానే కొన్ని పనులు అయినా ముందుకు కదిలాయని గుర్తు చేశారు. దాన్ని మరింత పెంచాలంటే మిగతా పార్టీలు కలిసి రావాలని డీసీఎం రిక్వస్ట్ చేశారు. 


Also Read: హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్​ తినాలనుకుంటే ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు.. టేస్టీ టాపింగ్స్​తో కూడిన, ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే


రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని మల్లు భట్టి విక్రమార్క అభ్యర్థించారు. అందుకే ఎలాంటి భేషజాలకు పోకుండా అన్ని పార్టీలను ఈ సమావేశానికకి ఆహ్వానించామని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంపీలతోపాటు కేంద్రమంత్రులు బండి సంజయ్‌, కిషన్ రెడ్డికి కూడా అహ్వానం పంపినట్టు వివరించారు. 


ఈసారి ముందుగానే సమాచారం ఇస్తామన్న భట్టి


సమయం తక్కువ ఉన్నందున తాము హాజరు కాలేమని బీజేపీ, బీఆర్‌ఎస్ సమాచారం పంపించాయని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇకపై ఏర్పాటు చేసే సమావేశానికి ముందుగానే వాళ్లకు సమాచారం పంపుతామని ప్రకటించారు. ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించిన నిర్ణయాలపై కూడా అందరి ఎంపీలకు సమాచారం పంపిస్తామని పేర్కొన్నారు. కేంద్రంతో ఇప్పటి వరకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇతర వివరాలు పొందుపరుస్తామన్నారు. 


అఖిల పక్షం ఏర్పాటు మంచి పరిణామం అన్న ఎంఐఎం 


కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసి స్వాగతించారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం పారదర్శకత పాటించడం లేదని ఆయన ఆరోపించారు. పక్షపాత ధోరణితో తెలంగాణకు అన్యాయం చేస్తోందని అభిప్రాయపడ్డారు. దీనిపై నిలదీసేందుకు అందరితో చర్చించి ముందుకు వెళ్లాలనుకోవడం మంచి పరిణామం అని అన్నారు. దీనికి మిగతా పార్టీలు కూడా సహకరించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 


Also Read: అప్పుడు మొఘల్ పాలకులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు గుడులు కూల్చుతున్నారు: ఈటెల రాజేందర్