Telangana 22A Land Dispute:తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న 22A నిషేధిత భూముల వివాదానికి శాశ్వత ముగింపు పలికేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. 2025 డిసెంబర్‌లో రూపొందించిన నూతన నిషేధిత జాబితాపై సర్వత్రా అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేథ్యంలో, ఆ వివాదాస్పద కొత్త జాబితాను పూర్తిగా పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ తలనొప్పుల నుంచి బయటపడటానికి 2023 డిసెంబర్‌ కంటే ముందు అమలులో ఉన్న పాత నిషేధిత జాబితాకే పరిమితం కావడం అత్యుత్తమ మార్గమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల ఉన్నతాధికారులు గట్టిగా యోచిస్తున్నారు. 

Continues below advertisement

ప్రభుత్వం నిబంధనలు, క్రమబద్దీకరణ జీవోలను సైతం బేఖాతరు చేస్తూ రెవెన్యూ యంత్రాంగం తయారు చేసిన కొత్త జాబితా వల్ల లక్షలాది మంది సామాన్య కొనుగోలుదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులపాలవుతన్నారని తేలడంతో సర్కారు ఈ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర టెలికాన్ఫరెన్స్‌ ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పక్కా ఆధారాలు ఉన్న భూములకు వెంటనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. 

22ఏ వివాదం అసలు కథేంటీ? 

నిషేధిత జాబితా అనేది దేవాదాయ, వక్ఫ్‌ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న సీలింగ్ భూములు, కోర్టు అటాచ్మెంట్లు, పన్ను ఎగవేతల కింద ఉన్న స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఉద్దేశించిన రక్షణ కవచం. 2007వ సంవత్సరం వరకు ఈ నిషేధిత భూములు అనే అంశంపై పెద్దగా చర్చలు జరిగేవి కావు. అప్పట్లో కేవలం 13. 82 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, 7.21లక్షల ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాలు, 41. 74 లక్షల ఎకరాల అటవీ భూములు, దేవాదాయ శాఖ పరిధిలోని 74, 128 ఎకరాలు, వక్ఫ్‌ బోర్డుకు చెందిన 45, 564 ఎకరాలు మాత్రమే ఈ జాబితాలో ఉండేవి. 

Continues below advertisement

కానీ కాలక్రమేణా  పరిధి అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తూ పోయింది. 2007  నుంచి 2017 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం భూముల్లో సుమారు 10 శాతం మాత్రమే 22 ఏ కింద ఉండగా, నేడు అది ఏకంగా 30 నుంచి 40 శాతానికి చేరిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2025 డిసెంబరులో అనాలోచితంగా రూపొందించిన కొత్త జాబితాలో దశాబ్దాలుగా రైతుల సాగులో ఉన్న వ్యవసాయ భూములు, ఔటర్ రింగ్‌ రోడ్డు లోపల నిర్మించిన బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, సామాన్యులు కొనుగోలు చేసిన ఓపెన్ ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలోకి నెట్టేయడం పెను దుమారానికి దారి తీసింది. 

డిసెంబర్‌ 2023 నాటి పాత జాబితా అమల్లోకి వస్తే....

కొత్తగా చేర్చిన ప్రైవేటు ఆస్తుల వల్ల రిజిస్ట్రేషన్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయి రియల్ ఎస్టేట్‌ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరాల వల్ల ఈ వారంలోనే వివాదాస్పద కొత్త జాబితాను రద్దు చేసి, 2023 డిసెంబర్‌ నాటి పాత జాబితా ప్రాతిపదికన మాత్రమే లావాదేవీలు జరపాలని ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. పాత రికార్డుల ప్రకారమే ముందుకు వెళ్లడం వల్ల ప్రస్తుతం తలెత్తిన అనేక వివాదాలు తక్షణమే సమసిపోతాయని అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. 

ఫాస్ట్‌ ట్రాక్‌ క్లియరెన్స్‌లతో ఊరట లభిస్తుందా?

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్‌లు స్వయంగా చొరవ తీసుకుని బాధితులకు ఫోన్‌ల ద్వారా సమాచారం అందిస్తూ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేస్తున్నారు. బాలానగర్‌ పరిధిలోని సర్వే నంబర్‌లో 101/1, 102/2, 102, 108, 109, 112, 81లలో సుమారు 3 వేల చదరపు మీటర్ల స్థలంపై ఉన్న 22A నిషేధాన్ని అధికారులు అధికారికంగా తొలగించారు. ఈ సర్వే నంబర్లు పరిధిలోని భూ యజమానులు ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ ఆస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సబ్‌రిజిస్ట్రార్‌ ప్రకటించారు. 

పోచారం గ్రామంలోని సర్వే నెంబర్ 50లో ఉన్న స్థలాన్ని గత డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డు భూమిగా చూపిస్తూ పొరపాటున 22A నిషేధిత జాబితాలో చేర్చారు. దీని వల్ల అక్కడి కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన క్లియరెన్స్ రావడంతో అక్కడ తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభించారు.కూకట్‌పల్లి పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో ఉన్న సుమారు 300 ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వం విజయవంతంగా తొలగించింది. ఈ సొసైటీకి చెందిన లబ్ధిదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ధరణి కమిటీ చేతికి చిక్కని 22A రికార్డులు 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను సంస్కరించడానికి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అసలు ఏ కేటగిరి కింద ఎంత భూమి 22A పరిధిలో ఉందో సమగ్ర నివేదిక ఇవ్వాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ను ధరణి కమిటీ కోరింది. అయితే సీసీఎల్‌ఏ నుంచి ధరణి కమిటీకి ఎలాంటి స్పష్టమైన నివేదికలు అందలేదు. నిషేధిత జాబితా రూపకల్పనలో ఎంతటి గందరగోళం, లోపాలు ఉన్నాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. 

22Aపై ఆగని రాజకీయ దుమారం 

నిషేధిత భూముల వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శల దాడి తీవ్రం చేశాయి. బీఆర్‌ఎస్ సీనియ్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి భారీ సెటిల్మెంట్‌లు, 30 శాతం కమీషన్లు, వసూలు చేయడానికే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రైవేటు భూములను 22A జాబితాలోకి నెట్టేసి కృత్రిమ సమస్యలను సృష్టించారని ఆరోపించారు. దీనికి బాధ్యత వహించి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో జోక్యం చేసుకున్న పెద్దలు ఎవరో తేల్చాలని అన్నారు. 

మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌ రెడ్డి కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన భూలావాదేవీలు, నిషేధిత భూముల జాబితా మార్పుల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై తక్షణమే సమగ్ర శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన వద్ద ఉన్న పక్కా ఆధారాలతో తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 

ఎటు చూసినా లక్షలాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ భూవివాదాన్ని పరిష్కరించడం ద్వారా అటు ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు, ఇటు విపక్షాల విమర్శల దాడికి కూడా అడ్డుకట్ట వేయాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తోంది.