Biryani Orders in Swiggy: బిర్యానీ దేశ వ్యాప్తంగా ఫేమస్. ప్రాంతాలను బట్టి అక్కడి సంప్రదాయ వెరైటీ రెసిపీలు ఉండొచ్చు. కానీ, బిర్యానీ మాత్రం ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆల్ టైం అందరి ఫేవరేట్ డిష్ గా కొనసాగుతోంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలకు ఉండే డిమాండ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ మాసం వంటి సమయాల్లో ఆ బిర్యానీలకు ఉండే డిమాండ్ అమాంతం పెరిగిపోతుంటుంది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఈసారి కూడా బిర్యానీలను జనం ఎంతగా ఇష్టపడ్డారో తెలిపే డేటాను ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ విడుదల చేసింది.


మామూలు రోజులతో పోల్చితే రంజాన్ మాసంలో బిర్యానీల ఆర్డర్ లు దాదాపు 15 శాతం పెరిగినట్లుగా స్విగ్గీ సంస్థ ప్రకటించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 8 వరకూ దేశ వ్యాప్తంగా వచ్చిన బిర్యానీ ఆర్డర్ ల డేటాను స్విగ్గీ తాజాగా ప్రకటించింది. మరోవైపు, రంజాన్ మాసంలో సాంప్రదాయ వంటకాలైన హలీమ్, సమోసా లాంటి ఆర్డర్లు కూడా భారీగానే ఉన్నాయని ఆ డేటా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉండగా.. 5.3 లక్షల ప్లేట్ల హలీమ్ ఆర్డర్లు ఇక్కడి నుంచి వచ్చాయని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.


స్విగ్గీ ప్రకటించిన వివరాల ప్రకారం.. రంజాన్ నెలలో సాయంత్రం 5.30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయి. దేశ వ్యాప్తంగా రంజాన్ నెలలో సాంప్రదాయ వంటకాల ఆర్డర్లు చెప్పుకోదగ్గరీతిలో పెరిగాయి. ఫిర్ని వంటకం ఆర్డర్లు ఏకంగా 80.97 శాతం పెరిగాయి. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫాలూదా 57.93 శాతం, ఖర్జూరాలు 48.40 శాతం పెరిగాయి. 


రంజాన్ పండుగ ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లను తాము డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్‌ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది. ఇఫ్తార్‌ సమయంలో చేసుకొనే ఆర్డర్‌లలో చికెన్‌ బిర్యానీ, మటన్‌ హలీమ్‌, సమోసా, ఫలుదా, ఖీర్‌లు టాప్‌ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని స్విగ్గీ వెల్లడించింది.