బీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులవుతున్న పార్టీలు, నేతల సంఖ్య పెరుగుతోంది. నిన్నటికి ఒడిశా మాజీ సీఎం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవాళ తమిళనాడుకు చెందిన సీనియర్ నటుడు శరత్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌వైపు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


సీనియర్ నటుడు, సమతావ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడిగా ఉన్న శరత్‌కుమార్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, బీఆర్‌ఎస్ విధానాలపై చర్చించినట్టు సమాచారం. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


కవితతో సమావేశమై చర్చలు జరిపిన శరత్‌ కుమార్‌ ఏ నిర్ణయం తీసుకోనున్నారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు సీనియర్ నేతలు, పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నారు. పార్టీ బలోపేతం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారు. ఈ టైంలో కవితతో శరత్‌కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.



ఒక్క తమిళనాడు మాత్రమే కాదు. అటు ఒడిశాలో కూడా బీఆర్‌ఎస్‌వైపు నేతలు మొగ్గారు. సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి గమాంగ్‌ ఫ్యామిలీతో కలిసి బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.  తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. గిరిధ‌ర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్‌ను  బీఆర్ఎస్ ఒడిషా శాఖ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. 


దేశంలోని అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మ‌హాన్ భార‌త్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. స‌క‌ల మాన‌వాళి సంక్షేమ‌మే బీఆర్ఎస్ స్వ‌ప్నం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దేశ భ‌విష్య‌త్ కోస‌మే బీఆర్ఎస్ ఆవిర్భ‌వించింద‌ని తేల్చిచెప్పారు. ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు.  రైతులు దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో 13 నెల‌ల ఉద్య‌మం ఎందుకు చేశారు. ఇప్ప‌టికీ రైతుల‌కు ఒక భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్న‌ది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను గెలిపించండి.. దేశంలో నీళ్లు, క‌రెంట్ ఎందుకు రావో నేను చూస్తాను. మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే ఏదైనా సాధ్య‌మే. తెలంగాణ‌కు అందుకు సాక్ష్యమని... తెలంగాణ‌లో సాధ్య‌మైంది.. దేశ‌మంత‌టా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. 


తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం.. దేశ‌మంతా ఎందుకు ఇవ్వ‌లేం. తెలంగాణ‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఆగిపోయాయి.. వ‌ల‌స‌లు వాప‌స్ వ‌స్తున్నాయి. నేను చెప్పేది ధ‌న్ కీ బాత్ కాదు.. మ‌న్ కీ బాత్. క‌రెంట్‌కు దేశంలో కొద‌వ లేదు.. 4 ల‌క్ష‌ల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంది. అన్ని ధ‌ర‌లు పెంచుకుంటూ పోవాలి.. జ‌నం జేబులు కొట్టేయాల‌నేదే కేంద్రం యావ‌. పేదోడి క‌డుపు కొట్టాలి.. ఉన్నోడి జేబులు నింపాలి.. దేశంలో న‌డుస్తున్న‌ది ఇదే. రైతులు కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి కూడా రావాలి. రైతులు నాగ‌లి ప‌ట్ట‌డ‌మే కాదు.. రాజ్యాంగాన్ని న‌డిపే నాయ‌కులుగా మారాల‌న్నారు కేసీఆర్.