తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తనదైన శైలిలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీ బస్సులు సహా అన్ని ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీలంగా కనిపించే పోస్టర్లను నిషేధించారు. ఇకపై అలాంటి పోస్టర్లకు సంబంధించిన ప్రకటనలు సేకరించవద్దని ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆర్టీసీ బ‌స్సుల‌పై అసౌక‌ర్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా ఉండే పోస్టర్లను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌కు స‌జ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.


హైదరాబాద్‌కు చెందిన ఓ పాత్రికేయుడు ఆర్టీసీ బ‌స్సుల‌పై కనిపించే అశ్లీల సినిమా పోస్టర్ల విషయాన్ని స‌జ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆ నెటిజ‌న్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ తక్షణం స్పందించారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఇలాంటి పోస్టర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చ‌ర్యలు తీసుకుంటాన‌ని స‌జ్జనార్ ప్రక‌టించారు. ఇచ్చిన ప్రక‌ట‌న మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల ఫోటోల‌ను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.


ఆర్టీసీ బస్సులపై కాస్త అసభ్యంగా, అశ్లీలంగా ఉండే పోస్టర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రోడ్డుపై వెళ్లే వారు రద్దీ సమయంలో కూడా ఆకర్షణగా కనిపించే పోస్టర్లను చూస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. రోడ్డుపక్కన ఉండే హోర్డింగుల విషయంలోనూ ఇది పాటించాలనే వాదన ఉంది. అయితే, బస్సులపై అంటించే అశ్లీల పోస్టర్లపై వ్యతిరేకత చాలా కాలంగా ఉంది. కానీ, అధిక ఆదాయం వస్తుందన్న కారణం, ఇంకా పలు కారణాలతో దానిపై చర్యలు తీసుకోలేదు.


Also Read: Girl Rape Case Updates: రాజు శవం మార్చురీకి.. స్థానికుల ఆగ్రహావేశాలు, ఏకంగా అంబులెన్స్‌పైకి..


Also Read: Rape Accused Death: కామాంధుడు రాజు మృతిపై తల్లి సంచలన ఆరోపణలు.. భార్య కూడా, మరోలా మాట్లాడిన అత్త