Hyderabad News: హైదరాబాద్ లోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రేవంత్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి పరిశీలించారు. ఆ ఆవరణలో రేవంత్ రెడ్డి అక్కడ మొక్క నాటారు. 2013లో కుతుబ్‌షాహీ వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టును అగాఖాన్‌ ఫౌండేషన్‌ చేపట్టింది. తెలంగాణ సాంస్కృతిక శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తాజాగా ఆ కార్యక్రమ ముగింపు నేడు జరిగింది.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు ఆనందంతో పాటు గౌరవంగా ఉంది. వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణ కు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ప్రతి ఒక్కరు వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉంది.


శతాబ్దాలుగా హైదరాబాద్ 'గంగా-జమునా తెహజీబ్'గా పిలుస్తూ బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని చూసింది. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ , సెవెన్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం  నిర్మాణ నైపుణ్యానికి , సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. మన ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటం తో పాటు  ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుంది. యునెస్కో  గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయానికి తెలంగాణ గర్వకారణం. 2013లో ఎంఓయూతో ప్రారంభించి,100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణ తో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో  చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనం. 


ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి , ఉదారతకు తెలంగాణ  ప్రభుత్వం , హైదరాబాద్ ప్రజల తరపున   అభినందనలు , కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా హాజరైన విశిష్ట అతిథులందరికీ, ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ కి ధన్యవాదాలు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.