Jewelery Bag Theft in Private Bus : ప్రైవేటు బస్సులో మూడు కోట్లు విలువజేసే నాలుగు కిలోల నగల బ్యాగును చోరీ చేసిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఒక దాబా వద్ద భోజనానికి నిలిపిన ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో అర్ధరాత్రి దొంగ లు భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణీకుల ముసుగులో బస్సులోకి ఎక్కి నాలుగు కిలోలు బంగారు ఆభరణాల బ్యాగును అపసంహరించుకుని పారిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీపై పోలీసుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. 


హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళుతున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సులో ముంబయికి చెందిన బంగారు నగల వ్యాపారి ఆశిష్‌ (32) మూడు కోట్లు విలువజేసే నాలుగు కిలోలు బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగుతో బస్సులోకి ఎక్కాడు. బస్సులో అంతా ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తున్నారు. జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద కోకిహినూర్‌ దాబాలో ప్రయాణీకులు తింటారన్న ఉద్ధేశంతో డ్రైవర్‌ బస్సు నిలిపాడు. అందరూ తినేందుకు దాబా వైపు వెళ్లగా, ఆశిష్‌ కూడా సిగరెట్‌ కాల్చేందుకు బస్సు దిగాడు. కొద్దిసేపటి తరువాత బస్సు ఎక్కి చూసిన ఆశీష్‌కు నగలుతో కూడిన బ్యాగ్‌ కనిపించలేదు. దీంతో ఆందోళన చచెందిన ఆశీష్‌ దాబా నిర్వాహకుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ప్రయాణీకులను ఆందోళనకు గురి చేసింది. 


క్షణాల్లోనే బ్యాగుతో పరారు


ఆశీష్‌ కిందకు దిగన వెంటనే ఇద్దరు దొంగలు ప్రయాణీకులు మాదిరిగా బస్సులోకి ఎక్కారు. రెండు నిమిషాల్లో ఆభరణాలు బ్యాగును భుజానికి వేసుకుని వెళ్లిపోయారు. ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి ముందుగా బస్సు దిగి ఇరువైపులా చూసి సైగ చేయగా, మరొకరు బ్యాగు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దొంగలు బస్సులోకి ఎక్కడం సహా బ్యాగుతో వెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జహీరాబాద్‌ డీఎస్సీ రామోహన్‌రెడ్డి, సీఐ శివలింగం శనివారం ఉదయం దాబాబకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులను గుర్తించేందుకు చిరాగ్‌పల్లి, జహీరీబాద్‌ పోలీసులు సీసీ పుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. 


ఆశిష్‌పైనే పోలీసుల అనుమానం


ట్రావెల్స్‌ బస్సు నుంచి మూడు కోట్ల విలువైన నాలుగు కేజీలు బంగారం ఆభరణాల బ్యాగు పోగొట్టుకున్న వ్యాపారి ఆశీష్‌ వ్యవహరశైలి పలు అనుమానాలకు కారణమైంది. ఫిర్యాదు చేయడంలో తడబాటుకు గురి కావడంతో పోలీసులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగలు దాడి చేసి రెండు కిలో ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఒకసారి, బస్సు ననుంచి కిందకు దిగి దాబాకు వెళ్లిన సమయంలో నాలుగు కిలోల బంగారు ఆభరణాల బ్యాగు చోరీకి గురైందని మరోసారి బాధితుడు పేర్కొనడంతో పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నగలకు సంబంధించిన పూర్తి బిల్లులు కావాలని పోలీసులు కోరగా, సదరు వ్యాపారి హైదరాబాద్‌ వెళ్లాడని, ప్రస్తుతం తాత్కాళికంగా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. చోరీ జరిగిన కోహినూర్‌ దాబాలో 2019లో ఇదే తరహాలో ట్రావెల్స్‌ బసస్సులో ముంబయి వెళ్తున్న ఓ వ్యాపారి నుంచి రూ.1.50 కోట్ల నగదు అపహరణకు గురైంది.