మంగళ్ హాట్ పోలీసుల నోటీసుపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ నుంచి తరిమేసినా సిద్దంగా ఉన్నానని, నోటీసులకు భయపడేది లేదంటూ స్పష్టం చేసారు. దేశవ్యాప్తంగా  గోరక్షణ , మతమార్పడి చట్టాల కోసం ముంబాయిలో  పోరాటం చేస్తే ఇక్కడ తెలంగాణాలో పోలీసులు ఎందుకు స్పందిస్తున్నారంటూ మంగళ్ హాట్ పోలీసులను ప్రశ్నించారు రాజాసింగ్. తాను ఈ రోజు ముంబాయిలో ఉన్నానంటూనే నోటీసులోని  అంశాలతోపాటు తన అభిప్రాయాన్ని, తనపై పోలీసులు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు.


మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌కు తాజాగా నోటీసులు ఇవ్వడం, వాటిపై ఈరోజు రాజాసింగ్ తీవ్ర స్పందించడం వెనుకు కారణం ఇటీవల ముంబయిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ. ఈ సభలో రాజాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ అనంతరం రాజాసింగ్ ముంబాయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో రాజాసింగ్ పాల్గొనడాన్ని తప్పుబడుతున్నారు మంగళ్ హాల్ పోలీసులు. పీడీయాక్ట్ కేసులో హైకోర్టు అనుమతితో బెయిల్ పై బయటకు వచ్చిన రాజా సింగ్‌ ఇలా బహిరంగ సభల్లో పాల్గొనడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తోందని నోటీస్లో పేర్కొన్నారు. అందులోనూ ముంబయిలో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బెయిల్ షరతులు ఉల్లంఘించి ఇలా సభలు, సమావేశాల్లో పాల్గనడంతోపాటు ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడంపై నోటీసులలో వివరణ కోరారు.


ఇలా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా మరోసారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు మంగళ్ హాట్ పోలీసులు. అయితే నోటీసులపై రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు ముంబయిలో ఉన్నానంటూ రాజాసింగ్  విడుదల చేసిన వీడియో ఆసక్తి రేపుతోంది.


ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన తాజా వీడియోలో తెలంగాణా ప్రభుత్వాన్ని, పోలీసులను టార్గెట్ చేస్తూ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నాకు ఓ లవ్ లెటర్ పంపారు అంటూ మొదలు పెట్టిన రాజాసింగ్‌... అనేక అంశాలపై నేరుగా తన వైఖరి స్పస్టం చేశారు. నేను ముంబయిలో జరిగిన సభలో పాల్గొంటే తప్పేంటని పోలీసులను ప్రశ్నించారు. లవ్ జిహాద్‌, మతమార్పిడులు, గో రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలని , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న నేను చట్టాలు తేవాల్సిన ఆవశ్యకతపై మాత్రమే మాట్లడాను. అందుకు మీరు ఎందుకు స్పందింస్తున్నారు. అదికూడా తెలంగాణాలో జరిగిన సభకాదు, మహారాష్ట్రలో జరిగిన సభ..అక్కడ సభ జరిగితే మీరు ఎందుకు మాట్లడుతున్నారని ప్రశ్నించారు రాజాసింగ్.


తాజాగా రాజాసింగ్ వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేపాయి. పీడీ యాక్ట్ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఇటు పోలీసుల తీరుపై అటు ప్రభుత్వంపై తీవ్ర స్దాయిలో విరుచుకపడటం ఇదే తొలిసారి కావడంతో రాజాసింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఓ మతాన్ని విస్మరించారని పీడీయాక్ట్ నమోదు చేయడం, రాజాసింగ్‌ను జైలుకు పంపడం తెలిసిందే. అయితే ఆ తరువాత కొద్ది రోజులపాటు మౌనంగా ఉన్న రాజాసింగ్ తాజాగా విమర్మల స్పీడ్‌ పెంచడంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తతం తాను ముంబయిలో ఓ కేసు విచారణలో హాజరైయ్యేందుకు కోర్టుకు వెళ్తున్నాని, గతంలో ముంబయిలో కాంగ్రెస్ పార్టీ తనపై కేసుపెట్టిందని, ఆ కేసు విచారణ నిమిత్తం ముంబయిలో ఉన్నానంటూ మొదలుపెట్టిన రాజాసింగ్ మంగళ్ హాట్ పోలీసులు,ఇటు తెలంగణా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.