Telangana News: కాంగ్రెస్ పార్టీలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పకున్నారు. శుక్రవారం (జూలై 12) సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి వచ్చి.. ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఫాలోవర్లు, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈయనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వలసలు పెరిగిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్‌, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ కుర్చీలు, మున్సిపల్ ఛైర్మన్లు కూడా కాంగ్రెస్ లో చేరారు.


గత నెలలో కూడా ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో కలిశారు. ఆ సమయంలో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను కలిశారు. ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డితో పాటు ప్రకాష్ గౌడ్ కూడా కేసీఆర్ ను కలిశారు. ఇంతలోనే బీఆర్ఎస్ ను వీడారు.