BRS MLA Lasya Nandita News: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు రామేశ్వరం బండ రహదారిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం ఘటనపై ఆమె సోదరి నివేదిత పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కారు నడిపిన డ్రైవర్ ఆకాష్ పై 304ఏ కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత ఇంకా సెక్షన్ లు ఏమైనా పెట్టాలేమో ఆలోచిస్తామని డీఎస్పీ తెలిపారు. ఉదయం 5.15 గంటలకు ఆకాశ్‌ తమకు ఫోన్‌ చేశాడని.. ఇద్దరికే దెబ్బలు తగిలాయని లొకేషన్‌ కూడా షేర్‌ చేశాడని లాస్య సోదరి నివేదిత పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. తాము వెళ్లి చూడగా.. కారు నుజ్జునుజ్జు అయి ఉందని వివరించారు.


మరోవైపు, అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్‌ రావు వెల్లడించారు. ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపు తప్పి ఓఆర్‌ఆర్‌ పక్కన రెయిలింగ్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు లాస్య నందిత బతికే ఉన్నారని.. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో లాస్య పీఏ, డ్రైవర్ అయిన ఆకాష్‌ కాళ్లు విరిగిపోయాయని ఏఎస్పీ తెలిపారు.