Telangana CM Revanth Reddy Japan Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో రెండో రోజు కూడా కీలక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్న జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మొదటి రోజు మారుబెనీ సహా పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం జరిగితే రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది. 

తెలంగాణలో కొత్త నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగం పంచుకునేందుకు చాలా కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఎన్‌టీటీ డేటా, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్‌క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌ వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందాయి ఈ సంస్థలు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు రూ. 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు  త్రైపాక్షిక ఒప్పందం  కుదుర్చుకున్నాయి.

టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్  తడావోకి నిషిమురా, ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బజ్‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా ఛైర్మన్ షరద్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.

దేశంలో అతిపెద్ద ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయంహైదరాబాద్‌లో 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నారు. 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్‌ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు సమకూర్చనున్నారు. దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా కంపెనీలు సంయుక్తంగా ఏఐ-ఫస్ట్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వమిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంభిస్తారు. ఈ ప్రాజెక్లును అత్యున్నత ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదం చేస్తుంది.

ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిలో విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వీటితోపాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎడబ్ల్యూఎస్, ఎస్‌టీటీ, టిల్‌మన్ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని అన్నారు. 

టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్‌టీటీ డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో పేరొందిన కంపెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో 193,000 మంది ఉద్యోగులతో, ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒకటి. పబ్లిక్ సర్వీసెస్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. నెయిసా నెట్​ వర్క్​ ఏఐ-ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ, నిర్దిష్ట ఏఐ కంప్యూట్ సొల్యూషన్స్‌ను అందించటంపై ఈ కంపెనీ దృష్టి పెడుతుంది.