దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు శిక్ష పడింది. ఒక్కొక్కరికి పదేళ్ల శిక్ష వేస్తూ ఎన్‌ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. వీళ్లకు లుంబినీపార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసుతో సంబంధాలు ఉన్నాయి. 


ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒబేద్‌ రెహ్మాన్‌, ఇమ్రాన్‌ఖాన్, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్‌ అలంను వివిధ పేలుళ్ల కేసులో దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ కోర్టు శిక్షలను ఖారరు చేసింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో వివిధ పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్న వీళ్లు హైదరాబాద్‌, ఢిల్లీలో కూడా పేలుళ్లకు రెక్కీ నిర్వహించారు. 


దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిపి భయభ్రాంతులు సృష్టించడంతోపాటు అలజడులు రేపాలని ఇండియన్ ముజాహిద్దీన్‌ ప్రయత్నించింది. నిషేధ జాబితాలో ఉన్న ఈ సంస్థ తరఫున పని చేసే ఈ నలుగురు సానుభూతి పరులు వారికి  దేశంలో పేలుళ్లకు కుట్రలో భాగమయ్యారు. హైదరాబాద్‌, బెంగళూరు పేలుళ్లలోనూ ఈ నలుగురిపాత్ర ఉన్నట్టు ఎన్‌ఐఏ రుజువు చేసింది. గోకుల్ చాట్‌, లుంబినీ పార్క్‌, దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయి. వారణాసి, ముంబై, ఫజియాబాద్‌, ఢిల్లీ పేలుళ్లలోనూ వీళ్ల పాత్ర ఉంది. 
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాల్లో ఈ నలుగురి పాత్ర ఉన్నట్టు ఎన్‌ఐఏ కోర్టులో వాదించింది. దానికి సరిపడా ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది.