MIM MLA Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగం కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెలువరించాల్సి ఉండగా, కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేడు కోర్టు తీర్పు వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకోసం కోర్టు పరిసర ప్రాంతాలు సహా, పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


దాదాపు పదేళ్ల క్రితం ఈ వ్యవహారం జరిగింది. మజ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ - ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపాయి. ఆ మాటలు రెండు మతాల మధ్య నిప్పు రాజేశాయి. ఎంతగా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. 


నిర్మల్‌లోని నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదేళ్ల క్రితం అంటే 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ ఓ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది.  ఆ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరితంగా మాట్లాడారు. ఆ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపాయి.


ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే... ‘‘మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే  మాత్రమే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం..’’ అంటూ అక్బరుద్దీన్ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ (నేరపూరిత కుట్ర), 153 ఏ (రెండు గ్రూపుల మధ్య మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడడం), 295 ఏ (ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు, ఏ వర్గం వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం), 298 (ఏదైనా వ్యక్తి యొక్క మతపరమైన భావాలను భంగం కలిగేలా ఉద్దేశపూర్వక ప్రసంగం), 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. 


ఆ సమయంలో అక్బరుద్దీన్ లండన్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చాక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్ అప్పట్లో 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇదే కాకుండా ఆదిలాబాద్ లోనూ అక్బరుద్దీన్ హిందూ దేవతల పైన అనకూడని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులపై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. అందుకే నేడు పోలీసులు నాంపల్లి కోర్టు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.