MLA Mynampally Rohit: మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన అగ్నికల్చర్ కాలేజీలో జరిగిన ఆందోళనలపై మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించారు. విద్యార్థుల తరపున తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. అలాంటి తాము రౌడీయిజం చేస్తున్నారని మల్లారెడ్డి, ఆయన అనుచరులు అనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల తరపున తాము పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే రోహిత్ హెచ్చరించారు. సోమవారం (మార్చి 18) రోహిత్ మీడియా సమావేశం నిర్వహించారు.


మల్లారెడ్డి తొడలు కొడితే హీరోయిజమా అంటూ ప్రశ్నించారు. తాము విద్యార్థుల పక్షాన నిలబడడం రౌడీయిజమా అటూ ప్రశ్నించారు. వాళ్లు చేస్తే రాజకీయం.. తాము చేస్తే వ్యభిచారమా అంటూ రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నో ఏళ్లుగా చేసిన అన్యాయాలు బయటకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాయ చేయలేరని రోహిత్ అన్నారు. ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ఫ్రీ సీట్లు అంటూ ప్రభుత్వ భూములను కబ్జా చేసి.. మల్లారెడ్డి నీతులు చెబుతున్నారని మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. ఈ ఆగడాలకు తాము అడ్డుకట్ట వేస్తామని ఎమ్మెల్యే రోహిత్ హెచ్చరించారు. విద్యార్థుల పొట్ట కొట్టి రూ.కోట్లు సంపాదించి నిర్లక్ష్యంగా మాట్లాడే మాటలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. వారు దోచుకున్న పాపపు సొమ్మును బయటకు తీస్తామని అన్నారు.


మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో సోమవారం (మార్చి 18) విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేశారు. విద్యార్థుల చదువు విషయంలో యాజమాన్యానికి శ్రద్ధ లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నినాదాలు దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి.. మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే రోహిత్ తండ్రి మైనంపల్లి హనుమంత్ రావు కాలేజీకి వచ్చి మద్దతు తెలిపారు.


మల్లారెడ్డి తనయుడు ప్రెస్ మీట్
ఎమ్మెల్యే రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి స్పందించారు. దాదాపు తమ విద్యాసంస్థల్లో 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని.. వారి భవిష్యత్తు నాశనం చేయొద్దని అన్నారు. మైనంపల్లి కాలేజీ లోపలికి వచ్చి, రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని అన్నారు. ఉదయం మైనంపల్లి హన్మంత్ రావు యూనివర్సిటీ లోపలకి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రా రెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా రాని ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రెండు నెలలుగా ఎందుకు వస్తున్నాయని అన్నారు. మైనంపల్లి చిల్లర రాజకీయాలు మానుకోవాలని భద్రా రెడ్డి హెచ్చరించారు.