MP Anil Yadav: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా పేరు మార్మోగుతోంది. అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణలను నిర్మూలించడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఒకరు హైడ్రాకు తన వంతుగా విరాళం అందించారు. హైదరాబాద్ లోని బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసిన ఎంపీ అనిల్ యాదవ్ కలిశారు. హైడ్రా పని తీరుపై ఎంపీ అనిల్ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.25 లక్షల రూపాయలను అనిల్ యాదవ్ కేటాయించారు. రూ.25 లక్షలు కేటాయిస్తూ ఆ లేఖను కమిషనర్ రంగనాథ్ కు అనిల్ యాదవ్ అందజేశారు. 


హైదరాబాద్ నగరంలోని చెరువులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి కమిషనర్ గా మంచి అధికారిగా పేరున్న ఏవీ రంగనాథ్ ను నియమించారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘హైడ్రా పని తీరు అభినందిస్తూ.. హైడ్రాకు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలను రంగనాథ్ కు అందజేశాం. పదేళ్లు అధికారంలో అన్న కేసీఆర్ హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దుతాం అన్నారు. కానీ హైదరాబాద్ లోని అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేక పోయారు. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల గురించి అలోచించి.. హైదరాబాద్ అద్భుతమైన నగరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.


రాజకీయాల కోసం హైడ్రా అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ అభివృద్ధి కోసం చేస్తున్నారు. అనేక నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బందులు రావద్దు అని ఈ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. పదేళ్ల కింద అనేక చెరువులు నిండు కుండలా ఉండేవి. అక్రమ కట్టడాలు చేపట్టిన వారు ఎవరు అయిన హైడ్రా వదిలిపెట్టదు. అటు డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. హైడ్రాను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలని వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి. జిల్లాలకు కూడా హైడ్రా విస్తరించాలి. హైడ్రాకు మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం’’ అని ఎంపీ అనిల్ యాదవ్ అన్నారు.