Harish Rao on Revanth Reddy: రేవంత్ రెడ్డి చేసేది చిట్ చాట్ కాదు.. చీట్ ఛాట్ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్ ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను ఆదానీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అదే అసెంబ్లీలో తాము అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా కాంగ్రెస్ నేతలు అబద్ధాలను, గోబెల్స్ ను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హరీశ్ రావు కూడా విలేకరులతో చిట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ. వంద శాతం రుణమాఫీ చేస్తామని మోసం చేశావు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు రుణమాఫీ జరగలేదని అంటున్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్పారు. ఆగస్టు 15 లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు. నేను విసిరిన ఛాలెంజ్ అదే.


రాహుల్ గాంధీని నేను తీసుకొస్తా
ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి. నేను ఎయిర్ పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని సీఎం స్వంత గ్రామానికి రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి తీసుకువెళ్తా. వ్యవసాయ శాఖా మంత్రి చెప్పినట్లు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. కేసీఆర్ ఆనవాళ్ళపై రేవంత్ రెడ్డి నిలబడ్డారు. సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ది ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచింది. 


ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా? ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతాను. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9 లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారు. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895 లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పి.ఏ ల పేరు మీద భూములు కొంటున్నారు.


రేవంత్ వల్లనే డీకే అరుణ గెలుపు
రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డి.కె.అరుణను గెలిపించారు. మోడీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారు. హైడ్రా విషయంలో అందరికీ ఒకటే రూల్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి,గుత్తా అమిత్ రెడ్డిని రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి. రాహుల్ గాంధీ ఆదానీ వద్దు అంటే రేవంత్ రెడ్డి అదానీ కావాలని అంటున్నారు. రుణమాఫీపై మేం రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకు?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.