రైతులు అకస్మాత్తుగా మృతి చెందితే... వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకమే ఇప్పుడు కొందరి అక్రమాలకు వేదికైంది. రైతులను నమ్మించి మోసం చేశారు. బతికున్న ఓ రైతును చనిపోయిన్టటు డాక్యుమెంట్స్‌లో చూపించి ఐదు లక్షల రూపాయలు కాజేశారు.



వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ చనిపోయిందని నమ్మించి ఆమె పేరు మీద ఉన్న రైతు బీమాను క్లైమ్ చేసుకున్నారు. అధికారిక రికార్డుల్లో కూడా ఆమె చనిపోయినట్టుగానే  రిజిస్టర్ చేశారు. చంద్రమ్మ పేరుపై ఉన్న ఎకరా ౩౦ గుంటల పొలానికి ఇవ్వాల్సిన రైతు బంధు పథకాన్ని ఆపేశారు. 


రెండు విడతలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు బంధు పథకం డబ్బులు చంద్రమ్మకు రాలేదు. అసలు విషయం తెలియని చంద్రమ్మ కొడుకు... బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి ఆరా తీశాడు. తమకు సంబంధం లేదని వ్యవసాయ అధికారులను అడగాలని సూచించారు. వారి సలహాతో అగ్రికల్చర్ ఆఫీసర్లను సంప్రదించాడు చంద్రమ్మ కుమారుడు బాలయ్య. మీ అమ్మ గతేడాది సెప్టెంబర్‌14న చనిపోయిందని... ఆమె పేరిట ఉన్న రైతు బీమా డబ్బులు నీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయని షాక్ ఇచ్చారు. 




అధికారులు చెప్పిన విషయాలకు షాక్ తిన్నాడు బాలయ్య. బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మింట్‌ తీయించాడు. వాళ్లు చెప్పినట్టుగానే గతేడాది డిసెంబర్‌9న బాలయ్య అకౌంట్‌లో ఐదు లక్షలు క్రెడిట్ అయ్యాయి. పడిన రోజు నుంచి విడతల వారీగా ఆ ఐదు లక్షలు వేర్వేరు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. ఇదంతా విన్న బాలయ్యకు దిమ్మదిరిగింది. 


ఇదంతా గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత, రైతు బంధు కోఆర్డినేటర్‌ రాఘవేదర్‌రెడ్డి పనిగానే చంద్రమ్మ, బాలయ్య అనుమానిస్తున్నారు. తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాఘవేందర్ రెడ్డి... తరచూ తమతో మాట్లాడుతూ రైతు భీమాకు కావలసిన డాక్యుమెంట్స్ తీసుకెళ్లాడని చెబుతున్నారు. వరిధాన్యం డబ్బులు మీ అకౌంట్లో వేయించానంటూ చాలా మంది వద్ద సంతకాలు తీసుకున్నాడని చంద్రమ్మ కొడుకు బాలయ్య చెబుతున్నాడు.


చంద్రమ్మ చనిపోయినట్టుగా పంచాయతీ సెక్రటరీ సంతకం చేసిన డెత్ సర్టిఫికెట్, దానిపై వ్యవసాయ అధికారి అటెస్ట్ చేస్తూ సంతకాలు ఉన్నాయి. కాని ఈ డెత్ సర్టిఫికెట్ మాత్రం గ్రామ పంచాయతీ రికార్డుల్లో నమోదు కాలేదు. రైతు అకాల మరణం చెందిన తర్వాత రైతుభీమా పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలంటే సదరు రైతు మరణ దృవీకరణ పత్రం తో పాటు, రైతు నామినీ అకౌంట్, ఆధార్ కార్డు, భూమి వివరాలు అవసరమవుతాయి. రైతు మరణించాడా లేదా అనేది పంచాయతీ సెక్రటరీ పంచనామా సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటిని జతచేసి వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత వ్యవసాయ అధికారి కూడా పరిశీలించాల్సి ఉంటుంది. 


రైతు బతికుండగానే చనిపోయినట్టు కాగితాలు సృష్టించి డబ్బులు కాజేసిన ఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం  తేలనుంది. రాఘవేందర్ రెడ్డి ఇలాంటి పైరవీల్లో దిట్టని... చంద్రమ్మ కుటుంబం మోసపోయిన విధంగానే మరి కొందరు కూడా మోసపోయినట్టు తెలుస్తోంది.